Covid Cases: పెరుగుతోన్న కోవిడ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి?
ABN , Publish Date - May 25 , 2025 | 08:53 AM
దేశంలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పది రోజుల్లోనే వీటి తీవ్రత అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే, ఈ ఇన్ఫెక్షన్లు చాలా స్వల్పంగానే ఉండటం కొంత ఉపశమనాన్ని కలిగించే అంశం.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే రాష్ట్రాలు పడకలు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల లభ్యత గురించి సన్నాహాలు ప్రారంభించాయి. కోవిడ్ కేసులు నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
INSACOG ఇస్తోన్న తాజా డేటా ప్రకారం, భారతదేశంలో కొత్తగా ఉద్భవిస్తున్న కోవిడ్-19 వేరియంట్ NB.1.8.1 ఒక కేసు, LF.7 వేరియంట్ నాలుగు కేసులు కనుగొన్నారు. కోవిడ్-19 కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం సమీక్షించారు. "తాజాగా వెలుగు చూసిన కోవిడ్ కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివి, అన్నీ కేసులు గృహ సంరక్షణలోనే ఉన్నాయని తేల్చారు. అయితే, పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉందని.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. కొన్ని కేసులు ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కనిపిస్తున్నాయని వెల్లడించారు.
కర్ణాటక: కోవిడ్ కేసుల పెరుగుదల గురించి ఆందోళన కలిగించేదేమీ లేదని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూ రావు శనివారం చెప్పారు. కర్ణాటకలో ఈ ఏడాది 35 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, గత 15 రోజుల్లో స్వల్ప పెరుగుదల ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సలహా కమిటీ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఢిల్లీ కోవిడ్ కేసులు: ఢిల్లీలో శుక్రవారం 23 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మూడేళ్లలో ఢిల్లీలో కోవిడ్-19 కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. మొత్తం 23 మంది కోవిడ్ రోగుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి తెలిపారు.
హర్యానా: కోవిడ్-19 కేసుల ఇటీవలి పెరుగుదలను ఎదుర్కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని, ప్రజలు భయపడవద్దని హర్యానా ఆరోగ్య మంత్రి ఆర్తి సింగ్ రావు శనివారం ప్రజలకు హామీ ఇచ్చారు. మే 23న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, హర్యానాలో నాలుగు యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని నోయిడా, ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 55 ఏళ్ల మహిళకు కోవిడ్-19 పాజిటివ్గా తేలడంతో ఆమెను హోం క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు శనివారం తెలిపారు. యుపిలోని ఘజియాబాద్లో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్గా తేలినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో ఆరోగ్య శాఖ నిఘా పెంచింది.
మహారాష్ట్రలోని థానే: థానేలో శనివారం ఒక కోవిడ్ రోగి మరణించగా, ఎనిమిది కొత్త వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ (టిఎంసి) తెలిపింది. థానేలో మొత్తం 18 మంది యాక్టివ్ కోవిడ్-19 రోగులు ఉన్నారని టిఎంసి తెలిపింది. వారిలో ఒకరు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరికొందరు ఇంటి క్వారంటైన్లో ఉన్నారని టిఎంసి వెల్లడించింది.
ఉత్తరాఖండ్: ఎయిమ్స్ రిషికేశ్లో మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు రోగులలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని రిషికేశ్ ఎయిమ్స్ డైరెక్టర్ మీను సింగ్ తెలిపారు.
తెలంగాణ: హైదరాబాద్లో ఒక కోవిడ్ కేసు నమోదైందని అధికారులు శుక్రవారం తెలిపారు. రోగి (పల్మోనాలజిస్ట్) పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. కూకట్పల్లి నివాసి అయిన సదరు వైద్యుడు ఐదు రోజులు కోవిడ్-19 ఐసోలేషన్ నిబంధనలను పాటించారని, అతనితో సంబంధం ఉన్న వారిని కూడా గుర్తించారని వైద్యాధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేసులు: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం మాట్లాడుతూ గత 24 గంటల్లో రాష్ట్రంలో నాలుగు కోవిడ్-19 కేసులు నిర్ధారించబడ్డాయని చెప్పారు. విశాఖపట్నంలో మూడు, రాయలసీమ ప్రాంతంలో ఒకటి ఉన్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద కూడా లేని తెలుగు చిత్ర పరిశ్రమ
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
For National News And Telugu News