Ahmedabad: మాటలకందని విషాదం
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:44 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
మనసును కలచివేస్తోంది: రాష్ట్రపతి ముర్ము
దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 12(ఆంధ్రజ్యోతి): అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదమని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ చర్యలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రధాని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే అవసరమైన సహాయం అందించాలని ప్రధాని ఆదేశించారు. మోదీ శుక్రవారం ప్రమాదస్థలిని సందర్శిస్తారు. ఏపీలోని విజయవాడలో ఎన్డీయే ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలకు హాజరైన రామ్మోహన్ నాయుడు... విమాన ప్రమాద వార్త తెలిసిన వెంటనే అహ్మదాబాద్కు బయలుదేరారు. ఈ ప్రమాదం మనసును కలచివేస్తోందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.
ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం మద్దతుగా నిలుస్తుందన్నారు. విమాన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జీ కిషన్రెడ్డి, బండి సంజయ్, శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయెల్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తదితరులు విమాన ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులతో పాటు వైద్య విద్యార్థులు మరణించడం కలచివేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కేటీఆర్, హరీశ్రావు, బీజేపీ ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సంతాప సూచకంగా గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగాల్సిన పలు కార్యక్రమాలను రద్దు చేశారు. ఈ ప్రమాదంపై విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్జెట్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఈ కష్ట సమయంలో ఎయిరిండియాకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నాయి. ఈ పెను విషాదం గుండెను పిండేస్తోందని బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అలియా భట్, విక్కీ కౌశల్, కరీనా కపూర్ తదితరులు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.