MP Raja: హోదా మరచి మాపై దుమ్మెత్తిపోస్తారా...
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:17 AM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.

- అసత్య ఆరోపణలతో బెదిరించటమే మీ పనా?
- ఎన్నికల హామీలపై నాతో చర్చకు సిద్ధమేనా?
- అమిత్షాకు ఎంపీ రాజా సవాల్
చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా(MP Raja) ధ్వజమెత్తారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మదురై సభలో అమిత్షా ప్రసంగించిన తీరు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో ఉందని, అసత్య ఆరోపణలు చేస్తే తమిళ ప్రజలు సులువుగా నమ్ముతారని అనుకున్నట్లుందన్నారు.
శాసనసభ ఎన్నికల సందర్భంగా డీఎంకే విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చడంతో పాటు చెప్పని హామీలను కూడా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) అమలు చేశారని వెల్లడించారు. డీఎంకే హామీల అమలుపై తనతో బహిరంగంగా చర్చించడానికి అమిత్షా సిద్ధమేనా అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి ఓ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆయనకున్న హోదా, బాధ్యత మరచిపోయి అక్కడి ప్రభుత్వాలపై అసత్యపు ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు. మదురై సభలో అమిత్షా ప్రసంగాన్ని గమనిస్తే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు రగిల్చే విధంగా ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న సుహృద్భావవాతావరణానికి గండికొట్టే రీతిలో ఆయన ప్రసంగించారన్నారు. రాష్ట్రంలోని కీలకమైన పథకాలకు కేంద్ర నిధులు విడుదల చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో ఆ పథకాలను అమలు చేస్తోందని, వాస్తవం ఇలా ఉండగా కేంద్రం భారీగా నిధులు మం జూరు చేసినట్లు ప్రకటించడం హాస్యాస్పదం గా ఉందన్నారు. అమిత్షా రాకతో డీఎంకే పాలకులంతా వణకిపోతున్నారని బీజేపీ నాయకులు చెప్పటం కూడా వింతగా, విడ్డూరంగా ఉందన్నారు. డీఎంకే అంటే భయంతోనే అమిత్షా రాష్ట్రానికి అదే పనిగా వచ్చివెళ్తున్నారని రాజా ఎద్దేవా చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా డీఎంకేకు అండగా నిలిచారన్న విషయాన్ని బీజేపీ పాలకులు మరచిపోయినట్లుందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా అంటే డీఎంకే నాయకులుగానీ, పార్టీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తమిళ భాష అంటే తనకు ఎంతో ఇష్టమని పదే పదే చెబుతున్న అమిత్షా తమిళ ప్రాచీన నాగరికత సంస్కృతిని వెలుగులోకి తెస్తున్న కీళడి తవ్వకాలపై సమర్పించిన రెండు నివేదికలను ఎందుకు అంగీకరించడం లేదో సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెబుతున్న అమిత్షా ఒకసారి మణిపూర్లో తాజాపరిస్థితులును స్వయంగా వెళ్ళి పరిశీలిస్తే సబబుగా ఉంటుందన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచి రాష్ట్రంలో అన్నాడీఎంకే - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వస్తుందని అమిత్షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన ధరలు
నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి
Read Latest Telangana News and National News