Share News

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:03 PM

ఈడీ దాడుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలికలు తేలేదని, పార్టీ ఐక్యంగా ఉందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.

Kharge: 11 ఏళ్లు, 33 తప్పిదాలు.. మోదీ సర్కార్‌పై మండిపడిన ఖర్గే
Mallikarjun Kharge, Narendra Modi

కలబురగి: కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్ పార్టీని విడగొట్టేందుకు మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి బళ్లారి ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఈడీ దాడులను ఖర్గే బుధవారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈడీ దాడుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలికలు తేలేదని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు.


నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన కేవలం అబద్ధాలు, యువకులను మోసం చేయడానికే పరిమితమైందని ఖర్గే ఆరోపించారు. '11 ఏళ్లలో 33 తప్పిదాలు చేశారు. పార్లమెంటులో కూడా నేను ఇదే మాట చెప్పిన సంగతి అందరికీ తెలుసు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం, యువకులను మోసం చేయడం, పేదలను కడగండ్లపాలు చేస్తున్న ఇలాంటి ప్రధానికి నా రాజకీయ జీవితంలోనే చూడలేదు' అని ఖర్గే ఘాటుగా విమర్శించారు.


డిప్యూటీ స్పీకర్ మాటేంటి?

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకుండా ఖాళీగానే ఉంచడంపై ప్రభుత్వాన్ని ఖర్గే నిలదీశారు. ప్రధాన విపక్ష పార్టీకి ఆ పదవి దక్కాల్సి ఉందని చెప్పారు. ఆ ఖాళీని భర్తీ చేయకపోవడం చట్టవిరుద్ధమని, విపక్షాలకు చిన్న పోస్ట్ కూడా మోదీ ఇవ్వడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు నమ్మకం లేదనడానికి ఇదే నిదర్శమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మోదీకి లేఖ కూడా రాసినట్టు చెప్పారు.


ఈడీ దాడులపై

కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్‌టీ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై సమగ్ర దర్యాప్తు జరిగేంత వరకూ తమ పార్టీ ఎలాంటి వ్యాఖ్యలు చేయదని ఖర్గే చెప్పారు. ఈ స్కామ్‌కు ఈడీ ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలనుకుంటున్నామని అన్నారు. నిధుల దుర్వినియోగం అంశ ఈడీకే వదిలిపెడుతున్నామని, కేసు విచారణలో తాము జోక్యం చేసుకోవమని తెలిపారు. ఎన్నికల్లో ఎవరు, ఎంతెంత ఖర్చుపెట్టారో అందరికీ తెలుసునని, ఈడీ దాడులు కొత్తేమీ కాదని, ఇలాంటి దాడులతో కాంగ్రెస్ పార్టీని విడగొట్టడం మాత్రం అసాధ్యమని అన్నారు.


మంత్రివర్గ విస్తరణ, కులగణనపై..

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఇప్పటికిప్పుడు లేదని ఖర్గే తెలిపారు. బెంగళూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు మంగళవారంనాడు ఢిల్లీలో రాహుల్ సమక్షంలో చర్చించినట్టు చెప్పారు. కర్ణాటకలో మళ్లీ కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ఖర్గే సమర్ధించారు. కులగణనలో సోషియా-ఎకనామిక్ క్రయిటీరియాను ఇప్పటికే ప్రభుత్వం పాటిస్తోందని, ఇందులో చోటుచేసుకోని మరో క్రయిటీరియాను కొత్త సర్వేలో చేర్చాల్సి ఉంటుందని చెప్పారు. బెంగళూరులో తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేయడంపై అడిగినప్పుడు, ఈ ఏడాది మొదట్లో కుంభమేళాలో విషాదం చోటుచేసుకుందని, సీఎం రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. తొక్కిసలాట ఊహించలేదని, దానికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని, బాధిత కుటుంబ సభ్యులకు తాము (ప్రభుత్వం) అండగా నిలబడమే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఖర్గే చెప్పారు.


రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..

తిరువణ్ణామలైలో మాంసాహార భోజనం..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 04:07 PM