Medha Patkar: పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్టు, విడుదల
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:34 AM
24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ను పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటలకే విడుదల చేశారు. జైలు శిక్షను హైకోర్టు సస్పెండ్ చేయడంతో పాటు, జరిమానా చెల్లించడంతో ఆమెను విడిచిపెట్టారు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పరువు నష్టం కేసులో సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కొద్ది గంటల వ్యవధిలోనే ఆమె విడుదలయ్యారు. మరోవైపు ఆమెకు విధించిన శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. 24 ఏళ్ల నాటి ఈ కేసులో ప్రొబేషన్ బాండు సమర్పించనందున ఆమెను అరెస్టు చేయాలని బుధవారం అదనపు సెషన్స్ జడ్జి నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేశారు. దాంతో పోలీసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మేధాపాట్కర్పై నర్మదా బచావో ఆందోళన్ సమయంలో పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఈ నెల 8న విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి సమాజానికి చేసిన సేవల దృష్ట్యా మేధా పాట్కర్కు జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే రూ.లక్ష జరిమానా విధించారు.
అరెస్టు చేయకుండా ఏడాది పాటు ప్రొబేషన్ ఇచ్చారు. ఈ నెల 23లోగా రూ.25వేలకు ప్రొబేషన్ బాండు చెల్లించాలన్నారు. కానీ ఆ రోజున జరిగిన విచారణకు మేధా హాజరుకాకపోవడంతో అరెస్టు చేయాలంటూ తాజాగా వారెంట్లు జారీ చేశారు. ప్రస్తుతం రూ. లక్ష జరిమానా చెల్లించడంతో పాటు, ప్రొబేషన్ బాండు సమర్పించడంతో ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు, మేధా పాట్కర్ రివిజన్ పిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆమె జైలు శిక్షను సస్పెండ్ చేసింది.