Maharashtra: అసెంబ్లీ జరుగుతుండగా రమ్మీ ఆడిన మంత్రి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:48 PM
రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యవసాయ మంత్రి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఆటలాడుకుంటున్నారని రోహిత్ పవార్ విమర్శించారు.

ముంబై: అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలోనే ఉన్న మహారాష్ట్ర మంత్రి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతూ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి నిర్వాకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసెంబ్లీ జరుగుతుండగా మహారాష్ట్ర మంత్రి మాణిక్రావు కోకాటే మొబైల్ ఫోనులో రమ్మీ గేమ్ ఆడుతున్నారంటూ ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. బీజేపీని సంప్రదించకుండా అధికార ఎన్సీపీ వర్గం ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉందని, వ్యవసాయ మంత్రి మానిక్రావుకు చేతిలో పనేమీ లేకపోవడంతో రమ్మీ ఆడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యవసాయ మంత్రి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఆటలాడుకుంటున్నారని రోహిత్ పవార్ విమర్శించారు.
మంత్రి స్పందన
కాగా, రమ్మీ ఆడుతున్నానంటూ విపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను మంత్రి మాణిక్రావు కోకాటే తోసిపుచ్చారు. అది సాలిటైర్ గేమ్ అని, రమ్మీ కాదని చెప్పారు. ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. తాను రమ్మీ ఆడటం లేదని, దిగువ సభలో ఏమి జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు విపక్షాలు ఇలాటి ఆరోపణలు చేస్తున్నాయని తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి