Madhya Pradesh: ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి
ABN , Publish Date - Jun 14 , 2025 | 07:23 PM
ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు మృత్యువాత పడ్డారు.

భోపాల్, జూన్ 14: మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా.. ఓ పురుషుడు ఉన్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాలాఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ నిఘావర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
మరోవైపు ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య పలుమార్లు జరిగిన ఎదురు కాల్పుల్లో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో అగ్రనేతలు సైతం ఉన్నారు. అయితే ఈ కూబింగ్ను తట్టుకోలేక కొందరు మావోయిస్టులు సరిహద్దు రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని పలు జిల్లాలోకి ప్రవేశించారంటూ నిఘావర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మార్చి, 2026 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే వారి నిర్మూలనకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే తాము చర్చలకు సిద్ధమని, ఆపరేషన్ కగార్ ఆపాలంటూ మవోలు చేసిన విన్నపాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం ప్రాణం తీసిన సెంటిమెంట్
For National News And Telugu News