PM Modi-Omar Abdullah: నాకు ప్రమోషన్ ఎప్పుడో.. మోదీ ముందు ప్రస్తావించిన సీఎం
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:27 PM
జమ్మూకాశ్మీర్లో అన్ని రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రితో తాను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మొదట అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభం కాగా, రెండవసారి బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభంలో పాల్గొన్నానని తెలిపారు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సమక్షంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చీనాబ్ బ్రిడ్జి, కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఆయనతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఒమర్ అబ్దుల్లా వేదికను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్లో అన్ని రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో ప్రధానమంత్రితో తాను వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మొదట అనంతనాగ్ రైల్వేస్టేషన్, ఆ తర్వాత బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ఎల్జీ మనోజ్ సిన్హా జూనియర్ స్థాయి నుంచి ప్రస్తుతం ఉన్నతస్థాయికి ప్రమోట్ అ్యయారని, తాను సీఎం స్థాయి నుంచి కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా డిమోట్ అయ్యానని చమత్కరించారు.
2014లో కాత్రా రైల్వేస్టేషన్ ప్రారంభమైనప్పుడు ఇదే నలుగురు వ్యక్తులు హాజరయ్యారని.. రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా జమ్మూకాశ్మీర్ ఎల్జీగా ప్రమోట్ అయితే, తాను ఒక రాష్ట్రం సీఎం నుంచి యూటీకి సీఎంగా డిమోట్ అయ్యానని ఒమర్ అబ్దుల్లా అన్నారు. పరిస్థితులు ఇప్పుడు సాధారణ స్థితికి చేరిన విషయం అందరికీ తెలిసిందేనని, జమ్మూకాశ్మీర్కు త్వరలోనే ప్రధానమంత్రి తిరిగి రాష్ట్ర హోదా ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు.. ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల జల్లు
For More National News and Telugu News..