Bihar Shocker: పీఎస్ సమీపంలో పట్టపగలే లాయర్ కాల్చివేత
ABN , Publish Date - Jul 13 , 2025 | 06:59 PM
లాయర్ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్టు పట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానికులు తుపాకీ కాల్పులు విని అక్కడికి చేరుకునే లోగానే..

పట్నా: బిహార్లో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్నాలోని సుల్తాన్గంజ్ పోలీసు స్టేషన్కు కేవలం 300 మీటర్ల దూరంలో పట్టపగలే గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ఒక లాయర్పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. రాష్ట్రంలో పెరుగుతున్న గన్ కల్చర్పై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అగంతకుల కాల్పుల్లో మృతిచెందిన వ్యక్తిని జితేందర్ కుమార్గా గుర్తించారు పోలీసులు. వృత్తిరీత్యా లాయర్ అయిన జితేందర్ కుమార్ గత రెండేళ్లుగా తన వృత్తిలో చురుకగా లేరని తెలుస్తోంది. రెగ్యులర్గా వచ్చే టీషాపులో టీ తాగి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారైనట్టు పట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. లాయర్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్టు చెప్పారు.
ఘటనా స్థలి నుంచి మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్థానికులు తుపాకీ కాల్పులు విని అక్కడికి చేరుకునే లోగానే అగంతకులు పరారైనట్టు చెప్పారు. కేసును అన్ని కోణాల్లోంచి విచారణ చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా హంతకులను పట్టుకుంటామని అన్నారు. పట్నా వ్యాపారి గోపాల్ ఖేమ్కాను అగంతకులు కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరోసారి ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో బిహార్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న మాజీ సీఎం
భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి