Kolkata: మళ్లీ షాకింగ్ ఘటన.. లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:55 PM
బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించిన పోలీసులు మరింత సమాచారం కోసం కాలేజీ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.

కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata)లో మళ్లీ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కోల్కతా కస్బా ఏరియాలోని లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం సంచలనమైంది. దీంతో మరోసారి రాష్ట్రంలోని విద్యా సంస్థలలో విద్యార్థుల భద్రతపై అనూమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కాలేజీ మాజీ విద్యార్థితో పాటు, ప్రస్తుతం కాలేజీలో చదువుతున్న మరో ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
సంఘటన వివరాల ప్రకారం, జూన్ 25వ తేదీ రాత్రి 7.30-8.50 గంటల మధ్య కస్బా లా కాలేజీ క్యాంపస్లో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దీనిపై బాధిత విద్యార్థిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించిన పోలీసులు మరింత సమాచారం కోసం కాలేజీ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివిధ వర్గాల ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అరెస్టుల పర్వం
బాధితురాలి ఫిర్యాదుతో జయిబ్ అహ్మద్ (19), మనోజిత్ మిశ్రా (31) అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. వారిని విచారించిన అనంతరం ఇదే కాలేజీలో చదువుకున్న మాజీ విద్యార్థి ప్రమిత్ ముఖోపాధ్యాయ్ (20)ను పోలీసులు అతని నివాసంలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రమిత్ ముఖోపాధ్యాయ్ను ఈ కేసులో కీలక నిందితుడిగా చెబుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం చిత్తరంజన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
నిందితులకు రిమాండ్
ఈ కేసులో నిందితులను అలిపోర్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, వచ్చే మంగళవారం వరకూ వారిని కోర్టు రిమాండ్కు పంపింది. నిందితుల్లో ఒకరైన మనోజిత్ మిశ్రా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడని చెబుతున్నారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం భయానకమని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ పేర్కొన్నారు. ఇటీవల ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనను ప్రస్తావిస్తూ, పశ్చిమబెంగాల్లో మహిళలపై నిరాఘాటంగా నేరాలు జరుగుతున్నాయని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేందుకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
చైనాతో ఫలించిన చర్చలు.. ఆరేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం..
రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..
For More National News