Kiran Bedi: పోలీసుల వాదన వినకుండా చర్యలా?.. తొక్కిసలాట ఘటనపై కిరణ్ బేడీ
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:53 PM
ప్రతి కేసులోనూ శాంతి భద్రతలకు ప్రత్యేకత ఉంటుందని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఒకరు ఉండాలని అన్నారు. పోలీసు యంత్రాంగమంతా కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు కమిషనర్ను మాత్రమే బాధ్యలను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని కిరణ్ బేడీ అన్నారు.

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బెంగళూరు కమిషనర్ బి.దయానంద్ను బదిలీ చేయడం సహేతుకం కాదని మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ (Kiran Bedi) అన్నారు. బి.దయానంద్ బదిలీని పోలీస్ అసోసియేషన్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. అసోసియేషన్ అభిప్రాయాన్ని కిరణ్ బేడే సమర్థిస్తూ, ప్రతి కేసులోనూ శాంతిభద్రతలకు ప్రత్యేకత ఉంటుందని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఒకరు ఉండాలని అన్నారు. పోలీసు యంత్రాంగమంతా కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు కమిషనర్ను మాత్రమే బాధ్యులను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు. ఇందువల్ల పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని చెప్పారు.
క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎవరి పాత్ర ఏమిటనేది స్టేడియం వెలుపల గుమిగూడిన జనాలను కూడా తెలియదని కిరణ్ బేడీ అన్నారు. భద్రతా చర్చల్లో పోలీసు యంత్రాంగం, సెక్రటేరియట్, రాజకీయ నాయకత్వం పాత్ర ఉందని.. కమిషనర్ (దయానంద్) ఒక్కరే ఇందుకు బాధ్యులు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవస్థలో పోలీసు కమిషనర్ ఒక భాగమని, ఒకవేళ సమస్య ఎదురైతే ఆయన కూడా సమస్యలో ఓ భాగమే కానీ సమస్య పరిష్కారం కోసం ఆయననే తొలగించడం సమర్ధనీయం కాదని కిరణ్ బేడీ అన్నారు.
కాగా, తొక్కిసలాట ఘటనలో పోలీసులను బలిపశువులను చేశారంటూ పోలీస్ అసోసియేషన్కు చెందిన పలువురు రిటైర్డ్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దయానంద్ వంటి నిజాయితీ కలిగిన పోలీసు ఆఫీసర్ను తొలగించడం ఆమోదయోగ్యం కాదని బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావు సైతం తెలిపారు. దయానంద్, ఆయన పోలీసు టీమ్ రేయింబవళ్లు సిటీని కాపాడుతున్నారని, ఆయనను బుల్డోజ్ చేయడం సరికాదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
పాక్తో గూఢచర్యం కేసులో కీలక మలుపు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి