Share News

Bengaluru Stampede case: తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం.. కర్ణాటక సర్కార్‌‌కు 9 ప్రశ్నలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:54 PM

తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు ప్రశ్నలను హైకోర్టు సంధిస్తూ, వీటిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. ఈ సందర్భంగా తొమ్మది ప్రశ్నలు వేసింది.

Bengaluru Stampede case: తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం.. కర్ణాటక సర్కార్‌‌కు 9 ప్రశ్నలు

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద ఈనెల 5న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ జవాబుదారీతనంపై ప్రశ్నించింది. ఈవెంట్‌ నిర్వహణ, అనంతరం వ్యవహించిన తీరు అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొంది. ఇంతటి విపత్తుకు దారితీసిన కారణాలు ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సమాధానం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసు పంపింది. తొక్కిసలాట ఘటనపై సుమోటో విచారణను కోర్టు మంగళవారంనాడు చేపట్టింది.


ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు ప్రశ్నలను హైకోర్టు సంధిస్తూ, వీటిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. ఈ సందర్భంగా తొమ్మది ప్రశ్నలు వేసింది.

1. విజయోత్సవం (విక్టరీ సెలబ్రేషన్) నిర్వహించాలని ఎప్పుడు, ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఏ పద్ధతిలో తీసుకున్నారు?

2.ట్రాఫిక్ నియంత్రణకు తీసుకున్న చర్యలు ఏమిటి?

3.పబ్లిక్/జనసమ్మర్ధాన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు ఏమిటి?

4.సభాస్థలి (వెన్యూ) వద్ద ఎలాంటి మెడికల్, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు?

5.ముందస్తుగా ఎంత మంది హాజరవుతారని అంచనా వేశారు? సెలబ్రేషన్స్‌ సమయంలో ఎవరు హాజరై ఉండవచ్చు?

6.క్షతగాత్రులకు తక్షణ వైద్యసహాయం కల్పించారా? కల్పించని పక్షంలో ఎందుకు కల్పించలేదు?

7.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఎంత సమయం పట్టింది?

8. ఇలాటి సెలబ్రేషన్లు, స్పోర్టింగ్ ఈవెంట్ జరిగినప్పుడు 50,000 మంది, అంతకుమించి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైనా ఉందా?

9. ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఏదైనా తీసుకున్నారా?


కాగా, ప్రశ్నలన్నింటికీ జవాబులు సమర్పించేందుకు కొద్దిపాటి సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ కోర్టును కోరారు. ఈ కేసులో కొందరు తమ అరెస్టులను లీగల్‌గా సవాలు చేయడం, ఉపశమనం పొందుతున్న క్రమంలో న్యాయ ప్రయోజనాల రీత్యా బహిరంగ కోర్టులో ఆ వివరాలు వెల్లడించలేమని ఆయన విన్నవించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తమ సమాధానాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేసే అవకాశం ఉంది.


తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారి నిఖిల్ సోసలే సోమవారంనాడు కోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఫెలిసిటేషన్ ఈవెంట్‌కు అందరినీ ముఖ్యమంత్రి ఆహ్వానించారని ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ప్రైవేటు లిమిడెట్ మరో పిటిషన్‌లో కోర్టుకు తెలిపింది. వీటిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..

రాజాను చంపి.. అతడి అంత్యక్రియల్లోనే అదిరిపోయే యాక్టింగ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 04:58 PM