Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు..అసలేమి తెలియదా..
ABN , Publish Date - May 20 , 2025 | 11:18 AM
భారత సైనిక సమాచారాన్ని పాకిస్థాన్తో పంచుకున్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జ్యోతి తండ్రి ఆమె గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

హరియాణా: దేశద్రోహం కేసులో అరెస్టైన హరియాణా హిసార్కు చెందిన 33 ఏళ్ల యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గురించి తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసింది. జ్యోతి తండ్రి హరీశ్ మల్హోత్రా మాట్లాడుతూ.. తన కుమార్తె పాకిస్థాన్కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఆమె ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పేదన్నారు. అంతేకాదు ఆమె యూట్యూబ్ ఛానెల్ గురించీ తెలియదన్నారు. గతంలో ఆమె పాకిస్థాన్లో వీడియోలు తీసిందని చెప్పిన ఆయన.. ఇప్పుడు తన వాదనను మార్చుకున్నారు. ఆమె ఇంట్లోనే వీడియోలు తీసేదని తాజాగా చెప్పుకొచ్చారు. అయితే వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అన్నది చర్చనీయాంశంగా మారింది.
యూట్యూబ్ జర్నీ
జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ ట్రావెల్ యూట్యూబర్గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఆ క్రమంలో ఆమె ఛానెల్లో 450కి పైగా వీడియోలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్రయాణ వీడియోలు కలవు. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్థాన్, 'ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ లాహోర్', కటాస్ రాజ్ టెంపుల్లో ఇండియన్ గర్ల్' వంటి వీడియోలు ఆమె ఛానెల్లో ప్రధానంగా పాకిస్థాన్ గురించి ఉన్నాయి. కానీ ఈ పర్యటనల వెనుక దాగి ఉన్న రహస్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె ఇండియాలో వీడియోలు షూట్ చేసిన ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులకు ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె పాకిస్థాన్ కోసమే ఇండియాలో అనేక వీడియోలు చేసిందా? అనే అనుమానం కలుగుతోంది.
గూఢచర్యం ఆరోపణలు
పోలీసుల విచారణలో ఇప్పటివరకూ అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ హైకమిషన్లోని ఒక అధికారితో సంబంధాలు కలిగి ఉందని, ఆమె రెండుసార్లు పాకిస్థాన్కు వెళ్లినట్లు తెలిసింది. హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ ప్రకారం, జ్యోతి ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ముందు కశ్మీర్ను సందర్శించిందని, అంతకుముందు పాకిస్థాన్కు వెళ్లిందని తెలిపారు. ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె ఆర్థిక లావాదేవీల గురించి సంబంధం లేకుండా చెప్పిన నేపథ్యంలో అధికారులు ప్రస్తుతం వాటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.
ఇరు దేశాల మధ్య
పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గామ్ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య నాలుగు రోజుల సైనిక సంఘర్షణ జరిగింది. ఈ సమయంలో పాకిస్థాన్ హైకమిషన్లోని ఒక అధికారితో జ్యోతి సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు జ్యోతిని తమ ఏజెంట్గా అభివృద్ధి చేస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె పాకిస్థాన్లో కొంతమంది హై ప్రొఫైల్ వ్యక్తులనూ కలిసినట్లు సమాచారం.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..
Trump Putin Call: రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..
IPL 2025: ప్లేఆఫ్ సినారియోను మార్చేసిన హైదరాబాద్ జట్టు..కానీ చివరకు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి