Share News

Indian Air Force: పాక్‌ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ

ABN , Publish Date - May 13 , 2025 | 04:31 AM

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత త్రివిధ దళాలు పాకిస్థాన్‌లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. నూర్‌ఖాన్‌, రహీమ్‌యార్‌ఖాన్‌ వంటి ముఖ్యమైన ఎయిర్‌బేస్‌ల రన్‌వేలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.

 Indian Air Force: పాక్‌ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ

  • నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ రన్‌వే ధ్వంసం

  • ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు తునాతునకలు

  • మా టాస్క్‌లను 100 శాతం పూర్తిచేశాం

  • ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ఆపరేషన్స్‌ డీజీల ప్రెస్‌ బ్రీఫింగ్‌లో వెల్లడి

న్యూఢిల్లీ, మే 12: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా మే 7న జరిపిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను 100ు కచ్చితత్వంతో ధ్వంసం చేశామని త్రివిధ దళాల అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు మద్దతుగా కాల్పులకు దిగి, భారత్‌పై క్షిపణి, డ్రోన్‌ దాడులు చేసిన పాకిస్థాన్‌కు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ సైన్యానికి, సైనిక సంపత్తికి ఏదైనా నష్టం జరిగితే.. దానికి వారే బాధ్యులన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎయిర్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీఏవో)/ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి, మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీఎంవో)/లెఫ్టెనెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌, నావల్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌/వైస్‌ అడ్మిరల్‌ ఏఎన్‌ ప్రమోద్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత విజయాలను గురించి వివరించారు. అందుకు ఆధారంగా పాకిస్థాన్‌పై దాడుల వీడియోలను, శాటిలైట్‌ చిత్రాలను ప్రదర్శించారు. పాక్‌ దాడిని భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయని, ఆకాశ్‌ క్షిపణి దెబ్బను దాయాదీకి రుచిచూపించామని వ్యాఖ్యానించారు. భారత్‌ సర్వసన్నద్ధతతో పాకిస్థాన్‌ ఆటలు సాగలేదన్నారు.


పాక్‌లోని 11 ఎయిర్‌ బేస్‌లకు నష్టం

భారత వైమానిక దళం దాడుల్లో పాక్‌ ఎయిర్‌బేసుకు భారీ నష్టం వాటిల్లినట్లు ఏకే భారతి వెల్లడించారు. ‘‘అత్యంత కచ్చితత్వంతో మేము ప్రయోగించిన క్షిపణులు లక్ష్యాలను ఛేదించాయి. ఫలితంగా పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన 11 ఎయిర్‌ బేస్‌లు-- నూర్‌ఖాన్‌, రహీమ్‌యార్‌ ఖాన్‌, రఫీఖీ, మురిద్‌, సుక్కుర్‌, సియాల్‌కోట్‌, పాసుర్‌, చునియాన్‌, సర్ధోగా, సక్రు, జకోబాబాద్‌ వాయుసేన స్థావరాలకు నష్టం వాటిల్లింది. నూర్‌ ఖాన్‌, రహీమ్‌యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేసుల్లో రన్‌వేలు దెబ్బతిన్నాయి’’ అని ఆయన వివరించారు. నూర్‌ఖాన్‌, రహీమ్‌యార్‌ఖాన్‌ ఎయిర్‌బేసుపై దాడి దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేసులో పాకిస్థాన్‌కు చెందిన ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ ఉంది. ఇక్కడే సాబ్‌ ఎయిర్‌బోర్న్‌ అర్లీ వార్నింగ్‌ వ్యవస్థలు, సీ-130 రవాణా విమానం, ఐఎల్‌-78 ఏరియల్‌ రీఫిల్లింగ్‌ ట్యాంకులు ఉన్నాయి. వీటిపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పాక్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎఫ్‌-16, జేఎ్‌ఫ-17ఎస్‌ ఫైటర్‌ జెట్లకు సర్ధోగ, భోలారీఎయిర్‌బేసులు ప్రధాన కేంద్రాలని ఏకే భారతి గుర్తుచేశారు. రహీమ్‌యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ పాకిస్థాన్‌కు వ్యూహాత్మక స్థావరమన్నారు. తమ పోరు ఉగ్రవాదంపైనేనని, కానీ, పాకిస్థాన్‌ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలిచి, ఈ పోరాటాన్ని పాక్‌ పోరాటంగా మార్చాయని పేర్కొన్నారు.


ఉగ్ర స్థావరాలపై..

పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్న 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని.. 24 క్షిపణులను ప్రయోగించినట్లు ఏకే భారతి తెలిపారు. ‘‘100 వాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్‌ గగనతల రక్షణ క్షిపణులను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించాం. పాకిస్థాన్‌కు చెందిన సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు. పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొన్నాం’’ అని వివరించారు. చైనా తయారీ పీఎల్‌-15 క్షిపణులు, తుర్కియేకు చెందిన డ్రోన్ల(వైఐహెచ్‌ఏ, సోంగర్‌)ను కూల్చిన తర్వాత లభించిన శకలాల చిత్రాలను మీడియాకు చూపించారు. దీనికి సంబంధించి నౌకాదళానికి చెందిన వైస్‌ అడ్మిరల్‌ ప్రమోద్‌ మరిన్ని వివరాలను అందజేశారు. ‘‘ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు, రాడార్లను ఉపయోగించాం. ఫ్లీట్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ను సమర్థంగా వినియోగించాం. డ్రోన్లు, హైస్పీడ్‌ క్షిపణులతో దాడులు చేశాం. నౌకాదళ అడ్వాన్స్‌డ్‌ రాడార్ల ద్వారా పాక్‌ డ్రోన్లను గుర్తించి, అడ్డుకున్నాం. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్‌ విమానాలను దగ్గరికి రాకుండా నిలువరించాం. ఈ విషయంలో త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. స్వదేశీ పరిజ్ఞానంతో బలమైన ప్రతిస్పందనను పాక్‌కు చూపించాం’’ అని వ్యాఖ్యానించారు.


అణు స్థావరాలపై దాడి చేయలేదు

సర్ధోగాఎయిర్‌బేసుకు సమీపంలో ఉండే కిరాణా హిల్స్‌లో తమ అణుస్థావరాలున్నట్లు పాకిస్థాన్‌ స్వయంగా తెలిపింది. కిరాణా హిల్స్‌పై భారత్‌ దాడులు చేసిందంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులపై ఏకే భారతిని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘పాక్‌ తన అణుస్థావరాల వివరాలను చెప్పినందుకు థాంక్స్‌. కానీ, కిరాణా హిల్స్‌ మా టార్గెట్‌ జాబితాలో లేవు’’ అని పేర్కొన్నారు. అయితే.. సర్ధోగా ఎయిర్‌బేసుపై దాడి నేపథ్యంలో.. పాకిస్థాన్‌ పౌరులు అణుస్థావరాలపై దాడులంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని తెలుస్తోంది.

కరాచీ కంటోన్మెంట్‌పై..

కరాచీలోని ‘మలీర్‌ కంటోన్మెంట్‌’పైనా దాడి చేసినట్లు వాయుసేన, నౌకాదళం వెల్లడించాయి. ఇజ్రాయెల్‌ తయారీ హరూప్‌ డ్రోన్లతో దాడి చేసినట్లు తెలిపాయి. నౌకాదళం అరేబియా సముద్రంలో మోహరించి, పాకిస్థాన్‌ యుద్ధ నౌకలను కరాచీ పోర్టుకు పరిమితం చేశామని వైస్‌ అడ్మిరల్‌ ప్రమోద్‌ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఆపరేషన్లకు తాము సిద్ధమని ప్రకటించారు. వాయుసేన, ఆర్మీ అధికారులు తాము తదుపరి ఆపరేషన్లకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 04:33 AM