Chennai: దేశంలోనే తొలిసారి.. 9 అంతస్థుల భవనంలో మెట్రో రైలు పరుగులు
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:53 PM
దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్థుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద ఆవిష్కృతం కాబోతోంది.

- తిరుమంగళం జంక్షన్లో నిర్మాణం
చెన్నై: దేశంలోనే మొట్టమొదటిసారిగా తొమ్మిది అంతస్థుల భవన సముదాయంలో నిర్మించే రైలు పట్టాలపై మెట్రోరైలు పరుగులు తీయనుంది. ఈ అద్భుత దృశ్యం తిరుమంగళం మెట్రో రైల్వేస్టేషన్(Tirumangalam) వద్ద ఆవిష్కృతం కాబోతోంది. రాజధాని నగరం చెన్నైలో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా తిరుమంగళం వద్ద షాపింగ్మాల్స్తో కూడిన బహుళ అంతస్థుల భవన సముదాయం మధ్య నుంచి వెళ్లేలా మెట్రోరైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
ఈ కొత్త రైలు మార్గానికి సంబంధించిన తొమ్మిది అంతస్థుల భవనసముదాయం, టవర్ల ఊహాచిత్రాలను చెన్నై మెట్రోరైల్వే (సీఎంఆర్ఎల్) బుధవారం విడుదల చేసింది. నగరంలో రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టును 116.1 కి.మీ వరకు మూడు మార్లాలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మాధవరం - షోళింగనల్లూరు మార్గంలోని తిరుమంగళం జంక్షన్ వద్ద మెట్రో రైల్వేస్టేషన్తో పాటు షాపింగ్మాల్స్తో 9 అంతస్థులతో ఏ, బీ, సీ పేర్లతో మూడు భవనాలు నిర్మించనున్నారు.
ఈ భవన సముదాయంలో రెండంతస్థుల రైల్వేస్టేషన్ కూడా నిర్మితమవుతుంది. ఈ భవన సముదాయలతో కూడిన మెట్రో రైల్వేస్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. కొత్తగా నిర్మించబోయే ఈ భవనంలో పలు కార్యాలయాలు, చిల్లర దుకాణాలు, మూడు సొరంగమార్గాల పార్కింగ్ స్థలాలుంటాయి. భారతదేశంలోనే వాణిజ్య సముదాయాలు కలిగిన భవనంలో ప్రయాణించేలా మెట్రోరైలు మార్గాన్ని నిర్మించడం ఇదే ప్రప్రథమమని మెట్రో రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం జపాన్, చైనా దేశాల్లోనే భవన సముదాయాల మధ్య నుంచి రైళ్లు వెళుతున్నాయని, ఆ రీతిలోనే నగరంలోనూ బహుళ అంతస్థుల భవన సముదాయంలోకి మెట్రో రైళ్లు దూసుకెళతాయని తెలిపారు. ఈ భవనసముదాయంలోని నాలుగో అంతస్థులో మెట్రోరైళ్లు ప్రయాణిస్తాయని, మూడో అంతస్థులో ప్రయాణికుల వెయింటింగ్ హాల్స్ ఉంటాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News