Amit Shah: సిందూర రేఖ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటాం
ABN , Publish Date - May 27 , 2025 | 02:54 PM
ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని అంతమొందిస్తామని అమిత్షా చెప్పారు. ముష్కరులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుచేశారు.

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో 'సిందూర రేఖ' ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పామని కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah) అన్నారు. పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత బలగాలు పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్షా ప్రస్తావించారు.
మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, మన తల్లులు, కుమార్తెలు, సోదరీమణుల నుదుటిపై సిందూరం ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని అంతమొందిస్తామని చెప్పారు. ముష్కరులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుచేశారు. పహల్గాంలో ఉగ్రవాదాలు అమాయక ప్రజలను వారి కుటుంబ సభ్యుల కళ్లముందే మతం అడిగి మరీ కాల్చిచంపారని, ఇందుకు వారు మూల్యం చెల్లించక తప్పదని, ప్రతి ఒక్కరిని ఏరిపారేస్తామని చెప్పారు.
దేశ సాయుధ బలగాలు, పౌరులు, సరిహద్దుల విషయంలో తాము ఎలాంటి రాజీ పడమని అమిత్షా తెలిపారు. మౌనంగా ఉండే శకం ముగిసింది. ప్రధాని నాయకత్వంలో భారతదేశం చాలా స్పష్టతతో, పూర్తి సామర్థ్యంతో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటుందని చెప్పారు. పౌరులు, సరిహద్దులు, బలగాలను ఎవరు సవాలు చేసినా ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. బుల్లెట్కు బాంబుతోటే సమాధానమిస్తామని ప్రధానమంత్రి సైతం చాలా స్పష్టంగా హెచ్చరికలు చేసినట్టు తెలిపారు.మూడు రోజుల మహారాష్ట్ర పర్యటనకు ముగింపుగా ముంబైలోని మాధవ్బాగ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం 150వ వార్షికోత్సవాల్లో అమిత్షా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..
ఇంకోసారి మా జోలికొస్తే అంతకంత అనుభవిస్తారు.. పాక్కు శశి థరూర్ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest National News and Telugu News