Share News

Indian Air Defense: పోరు బందర్‌

ABN , Publish Date - May 13 , 2025 | 04:47 AM

తాజా భారత్‌–పాక్‌ యుద్ధంలో డ్రోన్ల వాడకం చరిత్రలోనే అతి ఎక్కువగా కనిపించింది. వాటిని కూల్చడంలో బీఈఎల్‌ అభివృద్ధి చేసిన డీ4 వ్యవస్థ కీలకంగా నిలిచింది.

 Indian Air Defense: పోరు బందర్‌

  • పాక్‌ డ్రోన్ల వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు

  • హైదరాబాద్‌లో జామర్ల తయారీ

  • బెంగళూరులో రాడార్లు, బందరులో

  • ఎలక్ట్రో ఆప్టిక్స్‌, తుదిరూపు

  • శత్రు దేశానికి డేంజర్‌ బెల్‌ మన డీ4

గతంలో యుద్ధం అంటే యుద్ధ విమానాలు, ట్యాంకులు, శతఘ్నులు, యుద్ధ నౌకలే ఎక్కువగా కనిపించేవి. కానీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నుంచీ డ్రోన్ల పాత్ర చాలా ప్రధానంగా మారిపోయింది. తాజా భారత్‌-పాక్‌ యుద్ధంలో డ్రోన్ల వినియోగం పతాక స్థాయికి చేరింది. రెండు వైపుల నుంచి డ్రోన్లు, ఎగిరే బాంబులు (లాయిటరింగ్‌ మ్యూనిషన్లు) వందల, వేల సంఖ్యలో దాడులకు దిగాయి. అలాగే ప్రత్యర్థి డ్రోన్ల దాడిని తిప్పికొట్టే ఎయిర్‌ డిఫెన్స్‌ వినియోగమూ చాలా పెరిగింది. తుర్కియే, చైనాల నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను పాకిస్థాన్‌ పెద్ద సంఖ్యలో భారత్‌పై ప్రయోగించింది. అయితే వాటిని అడ్డుకోవడం, కూల్చివేయడంలో మన ఎయిర్‌ డిఫెన్స్‌ అద్భుత విజయాలు సాధించింది. ఇందులో ఎస్‌-400, ఆకాశ్‌ వంటి క్షిపణులతో పాటు మన భారత్‌ ఎలక్ట్రోనిక్స్‌ లిమిటెడ్‌ తయారుచేసిన డీ4 వ్యవస్థలు ప్రధాన పాత్ర నిర్వహించాయి.

డీ4 అంటే డ్రోన్‌ డిటెక్షన్‌, డెటర్‌ అండ్‌ డెస్ట్రాయ్‌. ఇందులో రాడార్లు, లేజర్లు, ఎలకో్ట్ర ఆప్టికల్‌ వ్యవస్థలు ముఖ్యమైనవి. భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ వీటిని అభివృద్ధి చేయగా పెద్దసంఖ్యలో తయారు చేసే బాధ్యతను భారత్‌ ఎలక్ట్రోనిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)కు అప్పగించారు. తయారీ దశలో మళ్లీ బీఈఎల్‌లోని పరిశోధన, అభివృద్ధి విభాగాలు వీటికి తుది మెరుగులు దిద్దుతాయి. ఈ డీ4 వ్యవస్థలకు కావాల్సిన రాడార్లను బెంగళూరు యూనిట్‌లో తయారు చేయగా, జామర్లను తెలంగాణలోని హైదరాబాద్‌ యూనిట్‌ ఉత్పత్తి చేస్తోంది. తర్వాత వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి తరలిస్తారు. మచిలీపట్నం యూనిట్‌ ఎలక్ట్రో ఆప్టిక్‌ ఉపకరణాలను తయారు చేయడంతోపాటు రాడార్లు, జామర్లను కూడా వాటికి అనుసంధానించి డీ4 వ్యవస్థకు తుదిరూపును ఇస్తుంది. అక్కడి నుంచి వాటిని సైన్యానికి అందజేస్తారు.


భారత్‌పైకి పాక్‌ ప్రయోగించిన డ్రోన్లను తొలుత రాడార్లు ఎక్కువ దూరం నుంచి గుర్తిస్తాయి. అవి కొంత దగ్గరకు వచ్చిన తర్వాత కెమెరాలు, లేజర్‌ రేంజ్‌ ఫైండర్‌ వంటి ఎలక్ట్రో ఆప్టిక్‌ పరికరాలు వాటిని మరింత స్పష్టంగా గుర్తించి భారత దళాలను అప్రమత్తం చేస్తాయి. ఆపై ఆ డ్రోన్లను రెండు రకాలుగా నేలకూలుస్తారు. ఒకటి జీపీఎస్‌ జామింగ్‌, రెండు లేజర్‌ ప్రయోగం! డ్రోన్లను ప్రత్యర్థి పైకి ప్రయోగించేటప్పుడు వాటిని జీపీఎస్‌ ద్వారా ప్రోగ్రామ్‌ చేస్తారు. అంటే భారత స్థావరాలు ఎక్కడ ఉన్నాయనే శాటిలైట్‌ డేటాను వాటిలో పొందుపరుస్తారు. ఆ తర్వాత మనం గూగుల్‌ మ్యాప్‌ సాయంతో కారు డ్రైవ్‌ చేసినట్లే ఇవి కూడా జీపీఎస్‌ సాయంతో అక్కడికి చేరుకుని దాడి చేస్తాయి. ఈ జీపీఎస్‌ సిగ్నల్‌ను ఎలక్ట్రోనిక్‌ పరికరాల సాయంతో జామ్‌ చేస్తే డ్రోన్లు ఎటు వెళ్లాలో దిక్కుతోచక కుప్పకూలిపోతాయి. లేదంటే ఈ డ్రోన్లపైకి లేజర్‌ను ప్రసరింపజేయడం ద్వారా కూడా కూల్చివేయవచ్చు. ఇలా డ్రోన్లను కూల్చడంలో బీఈఎల్‌ తయారీ డీ4 వ్యవస్థలు అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయని భారత రక్షణ శాఖ అధికారులు కొందరు ఆంధ్రజ్యోతికి తెలిపారు. రాను రాను యుద్ధాల్లో డ్రోన్ల వాడకం చాలా పెరగబోతోంది. యుద్ధ విమానాల నుంచి, యుద్ధ నౌకల నుంచి, యుద్ధ ట్యాంకుల నుంచి కూడా డ్రోన్లను ప్రయోగించడం, నియంత్రించడం వంటి పరిజ్ఞానాలు పెద్దఎత్తున రాబోతున్నాయి. అలాగే డ్రోన్ల తయారీ ఖర్చు తక్కు వ కావడంతో ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు సైతం వాటిని తయారు చేసి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బీఈఎల్‌ పరిశోధనల ఫలితమే ప్రస్తుత యుద్ధంలో కనిపించిందని రక్షణ అధికారులు పేర్కొంటున్నారు.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి

Updated Date - May 13 , 2025 | 07:40 AM