India UK Trade Deal: భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
ABN , Publish Date - May 07 , 2025 | 05:15 AM
భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరింది. దీని ద్వారా రెండు దేశాల మధ్య దిగుమతి సుంకాలు తగ్గడం, వాణిజ్యం పెరగడం, సృష్టి, పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించడానికి దోహదం అవుతుంది

ఇరు దేశాల మధ్య ‘సుంకాల’ తగ్గింపు
న్యూఢిల్లీ, మే 6: భారత్, యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. యూకే ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘యూకే ప్రధానితో మాట్లాడాను. భారత్, యూకే మధ్య ఇరుదేశాలకు ఎంతో ప్రయోజనం కలిగించే ప్రతిష్ఠాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చరిత్రాత్మకం. ఇరుదేశాల వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సృజనాత్మక ఆవిష్కరణలకు ఈ ఒప్పందం ఊతమిస్తుంది’’ అని మోదీ వెల్లడించారు. అనంతరం ఈ అంశంపై ప్రధాని కార్యాలయం, యూకే ప్రభుత్వం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. .
భారత్తో ఒప్పందం ఇరుదేశాల సంబంధాల్లో ఓ మైలురాయి అని స్టార్మర్ పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం.. భారత్, యూకేల మధ్య దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. పదేళ్లలో సుంకాలు సున్నా స్థాయికి చేరుతాయని యూకే ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. యూకే నుంచి మద్యం దిగుమతులపై 150శాతం నుంచి 40 శాతానికి, వాహనాలపై 100శాతం నుంచి 10 శాతానికి సుంకాలు తగ్గుతాయని పేర్కొంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం ప్రస్తుతం రూ.4.80 లక్షలకోట్లుకాగా.. పదేళ్లలో మరో రూ.2.90 లక్షల కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేసింది. ఇక, యూకేలో ఉద్యోగులు జాతీయ ఆరోగ్య బీమా కోసం ఏటా తప్పనిసరిగా 500 పౌండ్లు(సుమారు రూ.56 వేలు) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యూకేలో పనిచేసే భారతీయ ఉద్యోగులు..ఆ బీమా సొమ్ము కట్టాల్సిన అవసరం లేకుండా తాజాగా ఒప్పందం కుదిరింది