Rain Alert: ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో జూన్ 30 వరకు వర్షాలు
ABN , Publish Date - Jun 28 , 2025 | 10:51 AM
దేశవ్యాప్తంగా మరోసారి వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వానలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

దేశవ్యాప్తంగా వచ్చే రెండు, మూడు రోజుల్లో మళ్లీ వానలు కురియనున్నట్లు (Rain Alert) భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ క్రమంలో కోంకణ్ & గోవా, మధ్య మహారాష్ట్ర గాట్ ప్రాంతాలు, గుజరాత్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ (జూన్ 29), హర్యానా (జూన్ 29–30), ఉత్తరాఖండ్ (జూన్ 28 నుంచి జూలై 1), తూర్పు రాజస్థాన్, విదర్భ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలను కూడా నైరుతి రుతుపవనాలు కప్పేశాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా బలహీనపడుతోందని తెలిపింది. అయితే దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రాంతాన్ని బట్టి తక్కువ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సముద్రతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ రిపోర్ట్ సూచించింది.
ఈ ప్రాంతాల్లో మాత్రం..
ఐఎండీ ప్రకారం జూన్ 29 నుంచి జూలై 2 వరకు ఉత్తర ప్రదేశ్లో వానలు పడనున్నాయి. జూన్ 27 నుంచి జూలై 3 వరకు మధ్యప్రదేశ్లో, జూలై 1, 2న ఛత్తీస్గఢ్లో, జూన్ 29, 30న పశ్చిమ బెంగాల్లో, జూన్ 30 నుంచి జూలై 1న ఒడిశాలో, జూన్ 29న ఝార్ఖండ్లో వర్షాలు కురియనున్నాయి. కేరళలో ఈరోజు భారీ వర్షాలు పడనున్నాయి.
డిల్లీ-ఎన్సీఆర్ వాతావరణం
డిల్లీ-ఎన్సీఆర్లో వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా మారనుందని ఐఎండీ తెలిపింది. జూన్ 28న సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గి 35°C నుంచి 37°C మధ్య ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 26°C నుంచి 28°C మధ్య ఉండనున్నాయి. దక్షిణ-తూర్పు నుంచి గాలులు రోజంతా క్రమంగా పెరుగుతాయి. ఈ క్రమంలో జూన్ 29, 30న వర్షాలు వస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది.
ఇవీ చదవండి:
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి