IAF Chief AP Singh: సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు.. వాయుసేన చీఫ్ సీరియస్!
ABN , Publish Date - May 29 , 2025 | 06:37 PM
సంతకాలు చేస్తారు తప్ప డెలివరీలు చేయరంటూ భారత వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. ఆయుధాల డెలివరీల విషయంలో ఇదేం పద్ధతి అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టుల విషయంలో జాప్యం జరుగుతుండటంపై భారత వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. కాంట్రాక్టుల మీద సంతకాలు జరుగుతాయి గానీ డెలివరీలు మాత్రం సకాలంలో మొదలుకావని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొన్న అమర్ప్రీత్ సింగ్.. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎదుటే ఈ వ్యాఖ్యలు చేశారు. అనేకసార్లు కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయని, కానీ ఆయుధాలు మాత్రం ఎప్పటికీ అందవని అన్నారు. టైమ్లైన్ అనేది ప్రధాన సమస్యగా మారిందన్న వాయుసేన చీఫ్.. సకాలంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తికాలేదన్నారు. నిర్దేశిత గడువుకు తగ్గట్లు పని చేయనప్పుడు వాగ్దానాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. తేజస్ ఎంకే1 చాలా ఆలస్యమైందన్నారు అమర్ప్రీత్. తేజస్ ఎంకే2 ప్రొటోటైప్ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. ఆమ్కా ఫైటర్కు సంబంధించిన నమూనా విమానమూ రాలేదన్నారు ఎయిర్ మార్షల్ చీఫ్.
మాట ఇస్తే.. నెరవేర్చాలి!
మన భద్రతా దళాలు-పరిశ్రమ మధ్య నమ్మకం పెరగాల్సిన అవసరం ఉందన్నారు అమర్ప్రీత్ సింగ్. పారదర్శకత ఆవశ్యకత ఉందని, మాట ఇస్తే దాన్ని అందించి తీరాలని ఆయన స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా కోసం వాయుసేన తీవ్రంగా కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ రోజు సంసిద్ధంగా ఉంటేనే రేపటికి సన్నద్ధం కాగలమని ఎయిర్ మార్షల్ చీఫ్ తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవనే నమ్మకం ఉందన్నారు. యుద్ధాలు గెలవాలంటే బలగాలను శక్తిమంతం చేసుకోవాల్సిందేనని అమర్ప్రీత్ సింగ్ వివరించారు.
ఆపరేషన్ సిందూర్తో క్లారిటీ..
స్వదేశంలో రూపొందించిన రక్షణ సామగ్రిని ఉపయోగించాలని దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపారు వాయుసేన చీఫ్. ఈ సందర్భంగా ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగ్ను ప్రస్తావించారు అమర్ప్రీత్. దీంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. యుద్ధ రంగం వేగంగా మారిపోతోందన్నారు. రోజురోజుకీ సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ మనకు చాలా ప్రయోజనం చేకూర్చిందన్నారు. దీని వల్ల మనం ఎక్కడ ఉన్నాం.. భవిష్యత్ కోసం ఏం కావాలనే దాని మీద స్పష్టత వచ్చిందన్నారు. మనం చేయాల్సింది చాలా ఉందన్నారు అమర్ప్రీత్ సింగ్. ప్రైవేట్ రంగంపై దేశానికి ఎనలేని విశ్వాసం ఉందని.. ఆమ్కా ప్రాజెక్ట్ను ప్రైవేట్ సెక్టార్ కోసం క్లియర్ చేయడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇది చాలా పెద్ద నిర్ణయమని వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి