Bengaluru News: మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:52 PM
దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్షకుమార్ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆయన విడుదల చేశారు.
- టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్
బెంగళూరు: దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరు(Mangaluru)లోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్షకుమార్ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా బెంగళూరులో విక్రయాలు జరుపుతున్నట్లుగానే శ్రీవారి డైరీలు, క్యాలెండర్లు సిద్ధం చేశామన్నారు.
వేంకటేశ్వరస్వామికి సంబంధించిన డైరీలు, క్యాలెండర్లు సొంతానికే కాకుండా ఇతరులకు ఇచ్చేందుకు ఇష్టపడుతారని అటువంటి వారికోసమే సిద్ధం చేశామన్నారు. క్యాలెండర్లు రూ.15 నుంచి 450 విలువైనవి సిద్ధంగా ఉండగా, డైరీలు కేవలం రెండు రకాలు మాత్రమే ఉన్నాయని వాటి విలువ రూ.120, 150గా ఉన్నాయన్నారు. బెళగావి(Belagavi)లో ఆలయం నిర్మించే విషయమై ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఆమోదించామన్నారు.
ఆలయ నిర్మాణాలకు ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారన్నారు. నికరంగా ఎంత మొత్తం అనేది ప్రకటించలేదని కానీ నిర్మాణాలకు అవసరమైన వస్తువులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. తిరుమల పరిధిలో హిందూయేతర ఉద్యోగులను తొలగించామన్నారు. తిరుమల(Tirumala)లో భక్తులకు సౌలభ్యాలతో పాటు ఏర్పాట్లు కూడా గతంలో కంటే మెరుగుపడినట్లు భక్తుల ద్వారానే తెలుస్తోందన్నారు.

వయ్యాలి కావల్ ఆలయంలోనూ నిత్యం దర్శనంతో పాటు అన్ని పూజలు ఉంటాయన్నారు. ఇదే సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ జయంతి మాట్లాడుతూ స్థానిక ఆలయంలో రెండునెలలకు గాను హుండీ ద్వారా రూ.56. 08 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. డైరీలు, క్యాలెండర్లు అధికంగా కావాల్సిన వారు, బెంగళూరు కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవసరమనుకుంటే ఆన్లైన్ ద్వారా పొందవచ్చునన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News