Muslim growth: ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:52 AM
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది...

2010-20 మధ్య 25.6 శాతానికి
14.9 శాతానికి తగ్గిన హిందువుల జనాభా
క్రైస్తవుల జనాభాలోనూ తగ్గుదల నమోదు
మత విశ్వాసాలు పట్టని వారి సంఖ్య పైపైకి
ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడి
న్యూ ఢిల్లీ, జూలై 12: ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోందని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య పెరుగుతోందని, క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోందని తెలిపింది. ఈ సంస్థ 2010-20 మధ్య కాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ పదేళ్లలో 1.8% మేర తగ్గి.. ప్రపంచ జనాభాలో 28.8శాతానికి పడిపోయింది. అయినా.. అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతోంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6శాతానికి పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకొనే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుంచి 14.9శాతానికి తగ్గిపోయారని.. అయితే.. వారి సంఖ్య పెరిగిందని వివరించింది. 2010లో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా.. 2020లో ఆ సంఖ్య 120 కోట్లకు పెరిగింది. బౌద్ధులు, యూదులు, ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతోందని పేర్కొంది. కాగా.. మతమార్పిడి అనేది హిందువులు, ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడిచింది. ప్రపంచంలోని హిందువుల్లో 95%మంది భారత్లోనే ఉంటున్నారు. 2010లో భారత్లో హిందువుల జనాభా 80% కాగా.. 2020కి ఇది 79 శాతానికి పడిపోయింది. అదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా14.3% నుంచి 15.2 శాతానికి పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది