Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. భారత్కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం
ABN , Publish Date - Apr 23 , 2025 | 07:43 AM
పహల్గామ్లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో (PahalgamAttack) మంగళవారం (ఏప్రిల్ 22, 2025) జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ సహా ప్రపంచ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించి, భారతదేశానికి సంఘీభావాన్ని తెలియజేశారు.
ట్రంప్, మోదీ ఫోన్ సంభాషణ
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దారుణమైన దాడిలో అమాయకులు మరణించడం పట్ల ట్రంప్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు భారత్కు అమెరికా పూర్తి సపోర్ట్ చేస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ Xలో ఈ విషయాన్ని వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారని జైస్వాల్ తెలిపారు.
పుతిన్, మెలోని స్పందన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దాడిని "క్రూరమైన నేరం"గా అభివర్ణించి, దీనికి ఎటువంటి సమర్థన లేదన్నారు. దాడికి బాధ్యులైన వారు తగిన శిక్షను ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని కూడా ఈ దాడి పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు, గాయపడినవారు, భారత ప్రజలకు ఆమె సంఘీభావాన్ని తెలిపారు. పహల్గామ్లో జరిగిన ఈ దాడి తీవ్రంగా కలిచి వేసిందన్నారు. భారత ప్రభుత్వానికి, బాధితులకు మా పూర్తి మద్దతు ఉంటుందని మెలోని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ కూడా భారతదేశంతో నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
దాడి వివరాలు
అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు, అనంతరం ఆయన కాశ్మీర్కు చేరుకున్నారు. ప్రధాని మోదీ కూడా తన సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించి కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించారు.
భారత్లో ఆగ్రహం, భద్రతా చర్యలు
ఈ దాడిని భారత్లోని అన్ని వర్గాలు ఖండించాయి. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనను "హీనమైన చర్య"గా అభివర్ణించారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కార్యకలాపాలు చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రపంచ సంఘీభావం
ఈ దాడి భారత్ను మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో ఐక్యంగా నిలబడాలని పలు దేశాల నాయకులు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News