Glaceries: ముంచుకొస్తున్న ముప్పు.. ముంబై, చెన్నై, విశాఖ నగరాలు మునిగిపోనున్నాయా..
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:17 PM
భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రత 2°C పెరిగితే స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్ పూర్తిగా నీటిమట్టమవుతాయని తేలింది.

న్యూఢిల్లీ: ప్రపంచంలోని పలు దేశాలు మునిగిపోనున్నాయా.. అందులో భారతదేశం కూడా ఉందా.. ముంబై, విశాఖ, చెన్నై నగరాలు జల సమాధి అవుతాయా.. అంటే అవుననే చెబుతోంది ఓ సర్వే నివేదిక. అభివృద్ధి పేరుతో మానవ జాతి సృష్టిస్తున్న విధ్వంసం కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత 2.7°C పెరిగే అవకాశం ఉందని సదరు నివేదికలో పేర్కొన్నారు. ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఉన్న మంచు పర్వతాలు, మంచు నదులు కేవలం పావు వంతు మాత్రమే మిగిలి ఉంటాయని.. మిగిలిన మూడు వంతులు కరిగిపోతాయని పేర్కొన్నారు. దీని కారణంగా ప్రపంచంలోని కొన్ని దేశాలతో పాటు.. భారతదేశంలో ముంబై, చెన్నై, విశాఖపట్నం వంటి తీరప్రాంత నగరాలు జలమయం అవుతాయని చెబుతున్నారు. దాదాపు రెండు అడుగుల మేర నీటిలో మునిగిపోతాయని ఈ సర్వేలో పేర్కొన్నారు అధ్యయనకారులు.
క్షణాల్లోనే..
ఇప్పటికే స్విట్జర్లాండ్లో ఎత్తైన పర్వతాల నుండి ఒక మంచు చరియలు విరిగిపడి దిగువ ప్రాంతాలలో విధ్వంసం సృష్టించింది. ఈ మంచు తుఫాను దిగువ లోయలోని బ్లాటెన్ అనే గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసింది.అక్కడి ప్రజలకు కనీసం దాని నుండి బయటపడే అవకాశం కూడా లేకుండాపోయింది. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా స్మశానంలా మారింది. బార్చ్ అని పిలువబడే ఈ హిమానినది వల్ల గ్రామంలోని తొంభై శాతం ప్రాంతం పూర్తిగా నాశనమైంది. ఈ విలయం నుంచి 300 మంది తప్పించుకుని బయటపడ్డారు. వీరంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
ఉష్ణోగ్రత మరో 2.7°C పెరిగితే
తాజా అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలోని హిమానీనదాలు గతంలో అంచనా వేసిన దానికంటే చాలా వేగంగా కరుగుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి భూమి సగటు ఉష్ణోగ్రత మరో 2.7°C పెరిగితే.. ప్రపంచంలోని హిమానీనదాలలో కేవలం 24 శాతం మంచు మాత్రమే మిగిలి ఉంటుంది. అంటే హిమానీనదాల మంచులో 76% కరిగిపోతుంది.
తీవ్రమైన ముప్పు
పారిస్ ఒప్పందం ప్రకారం.. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5°C కంటే ఎక్కువ ఉండకూడదని నిర్ణయించారు. కానీ, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కేవలం 1.5°C పెరిగినా.. 46 శాతం హిమానీనదులు ఇప్పటికే కరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇక 54 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయంటున్నారు. ప్రస్తుత సగటు ఉష్ణోగ్రత హిమానీనదాల ఉనికికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని నివేదిక స్పష్టంగా సూచిస్తుంది.
ఈ ముఖ్యమైన వివరాలు..
సగటు ఉష్ణోగ్రత 2°C పెరిగితే స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్లోని అన్ని హిమానీనదాలు పూర్తిగా కరిగిపోతాయి.
ఉత్తర అమెరికాలోని రాకీ పర్వతాలు, యూరప్లోని ఆల్ప్స్, ఐస్లాండ్లోని దాదాపు 90 శాతం హిమానీనదాలు కనుమరుగవుతాయి.
సగటు ఉష్ణోగ్రతలో 2°C పెరుగుదల దక్షిణాసియాలోని హిమాలయాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
2020తో పోలిస్తే హిమాలయాలలో 25 శాతం మంచు మాత్రమే మిగిలి ఉంటుంది. 75 శాతం కరిగిపోతుంది.
హిమాలయాల నుండి ఉద్భవించిన.. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు కోట్లాది మంది ప్రజలకు ఎంతో కీలకం. ఆహారం, సాగు నీరు, తాగు నీరు సహా అనేక రకాల అవసరాకలు ఉపయుక్తంగా ఉన్నాయి.
ఉష్ణోగ్రత పెరుగుదల 1.5°C కి పరిమితం అయినప్పటికీ.. హిమాలయాలలోని హిమానీనదాల్లో 40 నుండి 45 శాతం మాత్రమే మిగిలి ఉంటుందని.. 55 నుండి 60 శాతం కరిగిపోతుందని అధ్యయనంలో పేర్కొన్నారు.
ఉష్ణోగ్రత పెరుగుదల ఆగిపోయినా.. హిమానీనదాల కరగడం శతాబ్దాలుగా కొనసాగుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ అధ్యయనం కోసం పది దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు పని చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2,00,000 కంటే ఎక్కువ హిమానీనదాల భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి పలు హిమానీనదాల నమూనాలను పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 275,000 హిమానీనదాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
Also Read:
స్త్రీలో ఈ లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం..
పీరియడ్స్ సమయంలో మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
For More National News