Bihar: ప్రశాంత్ కిషోర్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రి పార్టీ విలీనం..
ABN , Publish Date - May 18 , 2025 | 03:39 PM
జన్ సురాజ్ పార్టీతో తన పార్టీని విలీనం చేస్తూ ఆర్సీపీ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వాగతించారు. ఒక పెద్ద సోదరుడిగా ఆర్సీపీ సింగ్కు బిహార్ రాజకీయాలు, ప్రజల జీవనవిధానంపై ఎంతో అవగాహన ఉందని అన్నారు.

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) త్వరలో జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) స్థాపించిన 'జన్ సురాజ్' (Jan Suraaj) పార్టీలో తన పార్టీ 'ఆప్ సబ్కా ఆవాజ్' (Aap Sabki Awaz)ను విలీనం చేస్తున్నట్టు కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ (RCP singh) ఆదివారం నాడు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, జన్ సురాజ్ పై ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయని చెప్పారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై వ్యాఖ్యలు.. యూనివర్శిటీ ప్రొఫెసర్ అరెస్టు
''జన్ సురాజ్ నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారు. మా లక్ష్యం చిన్నది కాదు. బిహార్ అభివృద్ధికి పనిచేస్తాం. బిహార్కు సమున్నత చరిత్ర ఉంది'' అని ఆర్సీపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
బిహార్కు పెద్దన్న: పీకే
జన్ సురాజ్ పార్టీతో తన పార్టీని విలీనం చేస్తూ ఆర్సీపీ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వాగతించారు. ఒక పెద్ద సోదరుడిగా ఆర్సీపీ సింగ్కు బిహార్ రాజకీయాలు, ప్రజల జీవన విధానంపై ఎంతో అవగాహన ఉందని అన్నారు. ఇటు రాజకీయాలు, అటు సామాజిక వ్యవస్థపై లోతైన అవగాహన కొద్దిమందికే ఉంటుందన్నారు. స్వచ్ఛమైన పాలన, సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్న కొత్త రాజకీయ శక్తి బిహార్కు అవసరమని చెప్పారు.
కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు గత ఏప్రిల్ 16న భారత ఎన్నికల కమిషన్ సన్నాహకాలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200కు పైగా బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. బిహార్ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరగాల్సి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీయే మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉండగా, నితీష్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఈసారి గట్టి జవాబు ఇవ్వాలని విపక్ష 'ఇండియా' కూటమి పావులు కదుపుతోంది. పీకే 'జన్ సురాజ్' పార్టీ తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఎన్డీయే, ఇండియా కూటమికి తామే ప్రత్యామ్నాయం అని చెబుతోంది పీకే పార్టీ.
ఇవి కూడా చదవండి..