EPS: ఆ పథకాలను మేం అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం..
ABN , Publish Date - Aug 01 , 2025 | 10:12 AM
రాజకీయ దురుద్దేశంతో డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిన అన్నాడీఎంకే పథకాలను అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు.

- రామనాథపురం సభలో ఈపీఎస్
చెన్నై: రాజకీయ దురుద్దేశంతో డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిన అన్నాడీఎంకే పథకాలను అధికారంలోకి వచ్చాక పునఃప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ప్రచారం చేస్తున్న ఈపీఎస్ గురువారం రామనాథపురం నియోజకవర్గంలోని జాలర్లు, రైతులు, నేత కార్మికులు, పార్ట్టైమ్ టీచర్లు, అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈపీఎస్ మాట్లాడుతూ, డీఎంకే అవినీతిని ఎండగడుతూ ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషిచేసిందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం అమలుపరిచిన పథకాలకు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక రాజకీయ దురుద్దేశంతో డీఎంకే ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. రైతులు, కార్మికులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అన్నీ వర్గాల అండదండలతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు కొత్త పథకాలతో పాటు డీఎంకే నిలిపివేసిన పథకాలను కూడా అమలుచేస్తామన్నారు.
శ్రీలంక జైళ్లలో శిక్ష అనుభవిస్తూ తమిళ జాలర్లు చిత్రహింసల పాలవుతున్నారని ఈ సమస్యను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తమిళ జాలర్లకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టినట్లు ఈపీఎస్ తెలిపారు. రూ.14,400 కోట్లతో రూపొందించిన కావేరి-గుండారు పథకాన్ని అమలుచేశామని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ఈ పథకాలను అటకెక్కించిందని ఆరోపించారు. సాయంత్రం రామనాథపురం సంస్థానానికి వెళ్ళిన ఈపీఎస్, ఇటీవల అన్నాడీంకేలో చేరిన రామనాథపుర సంస్థాన యువరాజు నాగేంద్రసేతుపతి, ఆయన తల్లి, కుటుంబసభ్యులను పలకరించారు. అక్కడినుంచి రోమన్ చర్చి జంక్షన్ వరకు ఈపీఎస్ రోడ్షోలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..
Read Latest Telangana News and National News