Share News

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

ABN , Publish Date - May 22 , 2025 | 12:41 PM

Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Encounter: మరో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం
Encounter

ఛత్తీస్‌గఢ్, మే 22: మావోయిస్టులకు (Maoists) కోలుకోలే దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు (Nambala Keshava Rao) మృతి చెందడం మావోయిస్టుల ఊహించని దెబ్బే. నిన్నటి ఎన్‌కౌంటర్ ఘటన మరవక ముందే ఈరోజు (గురువారం) మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. తుమ్రేల్ అడవుల్లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.


వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా నిన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం నుంచి మావోయిస్టు శ్రేణులు కోలుకోక ముందే వరుస ఎన్‌కౌంటర్‌లు కొనసాగుతున్నాయి. ఈరోజు బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టు పార్టీకి కంచు కోటగా ఉన్న అబూజ్‌మడ్ మొత్తం భద్రతాబలగాల హస్తగతమైంది. భద్రతాబలగాలు వరుస ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. దేశంలో మావోయిస్టు పార్టీలను పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేపట్టిన ఆపరేషన్ కగార్ గత ఏడాది జనవరిలో ప్రారంభమైంది. అప్పటి నుంచి మావోయిస్టుల కంచుకోటలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఛత్తీస్‌‌గఢ్ దండకారణ్యం అంతా కూడా వార్ జోన్‌గా మారింది.


వచ్చే ఏడాది మార్చి 31 నాటి కంటే కూడా ముందే భద్రతాబలగాలు టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటి వరకు 500 మందికి పైగా మావోయిస్టులు హతమైనట్లు పౌరహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో అగ్రనేతలంతా కూడా నేలరాలడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ పలుమార్లు లేఖలు విడుదల చేసింది. తాము శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖలు విడుదల చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఈ క్రమంలో 50 ఏళ్ల నక్సలిజం ఆఖరి గడియల్లో ఉందనే చెప్పుకోవచ్చు. కేంద్ర కమిటీలో, పొలిట్‌బ్యూరోలో ఉన్న వారంతా వయో భారంతో, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కాల్పుల విరమణను పాటిస్తామని లేఖలు విడుదల చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు.


ఇవి కూడా చదవండి

ఇందిరా మహిళా శక్తి బజార్‌కు సుందరీమణులు

ముంబై వచ్చేసింది

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2025 | 01:02 PM