Elections: మేమూ ఎక్కువ సీట్లు అడుగుతాం..
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:45 AM
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కూటమి నుంచి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని డీఎంకే అధిష్టానాన్ని కోరుతామని డీపీఐ నేత తొల్ తిరుమావళవన్ ప్రకటించారు. చిదంబరం లోక్సభ నియోజకవర్గంలో గురువారం ఉదయం పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- డీపీఐ నేత తిరుమా
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కూటమి నుంచి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని డీఎంకే అధిష్టానాన్ని కోరుతామని డీపీఐ నేత తొల్ తిరుమావళవన్ ప్రకటించారు. చిదంబరం లోక్సభ నియోజకవర్గంలో గురువారం ఉదయం పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పినాత్తూరులో నిర్మించిన సమగ్ర తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. డీఎంకే కూటమిలో ఉన్న సీపీఎం ఈసారి పది సీట్లు కోరుతుండటాన్ని ఆయన సమర్థించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతి ఎన్నికల్లో సీట్లు పెంచాలని మిత్రపక్షాలన్నీ కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకేను కోరటం సహజమని, సీట్ల కేటాయింపు కమిటీ ద్వారా మిత్రపక్షాలు అధికంగా సీట్లు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తుంటాయని చెప్పారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా డీఎంకే మిత్రపక్షాలన్నీ ఆ పార్టీ నాయకత్వంలోని కూటమిలోనే కొనసాగుతున్నాయని, సీట్ల కేటాయింపులపై అసంతృప్తి ఉన్నా మతతత్త్వ శక్తుల నుండి ప్రజలను కాపాడడానికి బీజేపీ - అన్నాడీఎంకేను ఓడించాలన్న ఏకైక తీర్మానంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి అమిత్షా అదే పనిగా రాష్ట్రంలో పలుమార్లు పర్యటించినా బీజేపీకి ఓట్లు రాలవన్నారు.
రాష్ట్రంలో రానున్నది బీజేపీ- అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వమేనని అమిత్షా స్పష్టంగా ప్రకటించినా అన్నాడీఎంకే నేతలు ఆ ప్రకటనపై మౌనం దాల్చడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అధికారంలో భాగస్వామ్యం ఇచ్చేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు ఖరారైనప్పటికీ, అన్నాడీఎంకే మిత్రపక్షాలైన పీఎంకే, డీఎండీకే కొత్తగా ఏర్పాటైన కూటమిలో చేరేందుకు తటపటాయిస్తున్నాయన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సారి శాసనసభ ఎన్నికల్లో మునుపటి కంటే అధిక సంఖ్యలో సీట్లు కేటాయించాలని డీఎంకే అధిష్టాంపై ఒత్తిడి చేస్తామని తిరుమావళవన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News