30 రోజుల్లోనే ప్రీపెయిడ్-పోస్టు పెయిడ్ మార్పిడి
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:03 AM
మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రీపెయిడ్ ప్లాన్..పోస్టు పెయిడ్ ప్లాన్ల మధ్య మార్పిడిని సులభతరం చేసింది.

న్యూఢిల్లీ, జూన్ 13: మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా టెలికమ్యూనికేషన్ల విభాగం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రీపెయిడ్ ప్లాన్..పోస్టు పెయిడ్ ప్లాన్ల మధ్య మార్పిడిని సులభతరం చేసింది. ప్లాన్ మార్పిడికి ఉద్దేశించిన నిరీక్షణ సమయాన్ని భారీగా తగ్గించింది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారడం ఇక సులువు కానుంది. ఇంతవరకు ప్లాన్ మార్పిడికి 90 రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. దానిని 30 రోజులకు తగ్గించింది. ఓటీపీ ద్వారా కేవైసీ వెరిఫికేషన్ చేయించుకొని ప్లాన్ను మార్చుకోవచ్చు. బీఎ్సఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.
ప్లాన్ మార్చుకోవాలనుకునే వారు తొలుత సంబంధిత టెలికాం కంపెనీ ఔట్లెట్కు వెళ్లి ఓటీపీ ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్లీ పాత ప్లాన్కు రావాలనుకుంటే మాత్రం 90 రోజుల పాటు వేచిచూడడం తప్పనిసరి. తొలిసారిగా ప్లాన్ మార్చాలనుకునే వారికే 30 రోజుల సమయం వర్తిస్తుంది. అప్పుడు కూడా మళ్లీ కేవైసీని చేయించాల్సి ఉంటుంది. బిల్లింగ్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకే రెండోసారి మార్పిడికి మళ్లీ 90 రోజుల గడువును పెట్టింది.