Defence Minister Rajnath Singh: పీవోకేపై రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల కోరిక అదేనంటూ..!
ABN , Publish Date - May 29 , 2025 | 01:52 PM
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అక్కడి ప్రజల మదిలో ఉన్న కోరిక ఏంటో ఆయన పంచుకున్నారు. మరి.. ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం..

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కాల్పుల విరమణకు ఒప్పుకున్న ఇండియా.. శత్రుదేశాన్ని మాత్రం వదలడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాల ముందు బయటపెడుతోంది. అఖిలపక్ష ఎంపీల బృందాన్ని విదేశాలకు పంపించిన మోదీ సర్కారు.. పాక్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తోంది. అన్ని వైపుల నుంచి శత్రుదేశాన్ని అష్టదిగ్బంధం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ.. మనతో పెట్టుకోవాలంటే వణికేలా చేస్తోంది. ఈ తరుణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని ఆయన అన్నారు. అక్కడి ప్రజలు భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అతి త్వరలో పీవోకేను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
తప్పక కలుస్తారు!
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు మన కుటుంబసభ్యులన్ని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భౌగోళికంగా వేరు పడినా వారు ఎప్పటికైనా ఇండియాలో కలుస్తారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ చాలా బలంగా ఉందన్నారు. పీవోకేలోని చాలా మంది ప్రజలు ఇండియాలో కలవాలని కోరుకుంటున్నారని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. కొంతమంది మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారని ఆయన వివరించారు. పీవోకే ప్రజలు ఏదో ఒక రోజు భారత్లో ఏకమవుతారని.. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పీవోకే దానంతట అదే వస్తుందని.. అక్కడున్న వారికి ఇండియాతో దృఢమైన బంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. పీవోకేలోని మెజారిటీ ప్రజలు భారత్లో కలవాలని కోరుకుంటున్నారని.. కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని చెప్పుకొచ్చారు. మనం ఏదైనా చేయగలమని.. అయితే శక్తితో పాటు సంయమనం కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు రాజ్నాథ్. మేకిన్ ఇండియా ఆవశ్యకత ఏంటో ఆపరేషన్ సిందూర్తో అందరూ గ్రహించారని వ్యాఖ్యానించారు. ఫైటర్ జెట్లు, మిసైల్ సిస్టమ్స్ నిర్మించడంతోపాటు అధునాతన యుద్ధ సాంకేతికతలను అభివృద్ధి చేయడం మీద దృష్టిపెట్టామని రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
కన్నడ చరిత్ర గురించి ఆయనకేం తెలుసట
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి