Modi Cyprus Visit: విమానాశ్రయం వచ్చి మోదీకి ఘన స్వాగతం పలిసిన సైప్రస్ ప్రెసిడెంట్.. పిక్స్ వైరల్
ABN , Publish Date - Jun 15 , 2025 | 08:54 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటన భారతదేశానికి ఎందుకు ముఖ్యమనేది ఇక్కడ తెలుసుకుందాం.

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం నాడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జూన్ 15 నుంచి 18 వరకు సైప్రస్, కెనడా, క్రొయేషియాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఈ సమయంలో ఆయన జీ7 శిఖరాగ్ర సమావేశానికీ హాజరవుతారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ సైప్రస్ (Modi Cyprus Visit) చేరుకున్నారు. ఈ క్రమంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు.
మోదీ ట్వీట్
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైప్రస్కు చేరుకున్న చిత్రాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. విమానాశ్రయంలో తనను స్వాగతించిన ప్రత్యేక గౌరవానికి సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారతదేశం-సైప్రస్ సంబంధాలకు, ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి సహా ఇతర రంగాలలో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.
రెండు దశాబ్దాల తర్వాత
సైప్రస్ పర్యటన అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా ఉండబోతోందని భారత హైకమిషనర్ మనీష్ అన్నారు. మన దేశం నుంచి ఒక ప్రధాన మంత్రి రెండు దశాబ్దాల తర్వాత ఈ దేశం వెళ్లినట్లు గుర్తు చేశారు. ఈ దేశాన్ని ప్రధాని మోదీ తొలిసారిగా పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం, పెట్టుబడులలో అత్యంత ముఖ్యమైన ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. రక్షణ, భద్రతా సహకారం, వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలతోపాటు ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపైనా చర్చిస్తామని వెల్లడించారు.
ఉగ్రవాద దాడిపై సైప్రస్ (Modi Cyprus Visit)
ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. దీంతోపాటు, ఆయన లిమాసోల్లో వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సైప్రస్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. EU స్థాయి చర్చలలో పాకిస్థాన్ నుంచి ఉద్భవించే సీమాంతర ఉగ్రవాద అంశాన్ని లేవనెత్తుతుందని సూచించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తోడ్పడుతుంది. దీంతోపాటు మధ్యధరా ప్రాంతం, EUతో భారతదేశ నిబద్ధతను బలోపేతం చేయడంలో కూడా కీలకం కానుంది.
జీ7లో ఆరోసారి
జూన్ 16 నుంచి 17 వరకు G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి ప్రధాని మోదీ కెనడాకు వెళతారు. జూన్ 18న క్రొయేషియాకు వెళ్లిన తర్వాత తన అధికారిక పర్యటనను ముగించనున్నారు. ప్రధాని మోదీ తన కెనడా కౌంటర్ మార్క్ కార్నీతో సమావేశం నిర్వహిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన సమావేశం తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా సమావేశం కానున్నారు. G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వరుసగా ఆరోసారి పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కన్నప్ప సినిమాకు షాక్.. బ్రాహ్మణ చైతన్య వేదిక పోరాటం సక్సెస్..
సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..
For National News And Telugu News