Congress Questions: పహల్గాం కుట్రదారులను చంపారా
ABN , Publish Date - May 13 , 2025 | 06:10 AM
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం, మృతులపై వివరణ కోరుతూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.

భద్రతా వైఫల్యానికి బాధ్యులెవరు
పార్లమెంటు ప్రత్యేక భేటీ ఎందుకు పెట్టరు
ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ/తిరువనంతపురం, మే 12: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి కుట్రదారులను అరెస్టు చేయడం గానీ, చంపేయడం గానీ చేశారా అని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఘటనకు సంబంధించి భద్రతావైఫల్యానికి బాధ్యులెవరని నిలదీసింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా రాజీనామా చేస్తున్నారో లేదో చెప్పాలని అడిగింది. ద్వైపాక్షిక అంశమైన కశ్మీరుపై దేశం వైఖరి మారిందా.. మూడో దేశం జోక్యంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి భూపేశ్ బఘేల్ ఢిల్లీలో, మరో జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. భారత్-పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మన దౌత్య వైఫల్యం కాదా అని నిలదీశారు. తాజా పరిణామాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను గానీ, అఖిల పక్ష సమావేశాన్ని గానీ ఎందుకు ఏర్పాటుచేయడం లేదని బఘేల్ ప్రశ్నించారు. ఇకపై ప్రధాని మోదీ రాకుంటే తమ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అఖిల పక్షానికి రారని స్పష్టంచేశారు. కశ్మీరు అంశంపై మూడో పక్షం జోక్యానికి భారత్ సిద్ధంగా ఉందా అని వేణుగోపాల్ ప్రశ్నించారు. అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లవుతుందన్నారు.