Bengaluru Stampede: ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. సీఎంపై గవర్నర్కు ఫిర్యాదు
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:52 PM
ఆర్సీబీ వంటి ప్రైవేట్ క్రికెట్ ఫ్రాంచైస్ కోసం గ్రాండ్ రెసెప్షన్కు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని గిరీష్ కుమార్ ప్రశ్నించారు. ఐపీఎల్ అనేది కమర్షియల్ వెంచర్ అని, ఇందులో నేషనల్ ప్రైడ్ కంటే లాభాల ఉద్దేశమే ఉంటుందని పేర్కొన్నారు.

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం పలు సస్పెన్షన్లు, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ నిరసనల దాడి తగ్గుముఖం పట్టడం లేదు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు విధాన సౌధలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆదివారం నిరనసలు తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసారు. ఇదే సమయంలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై గవర్నర్ గిరీష్ కుమార్కు బెంగళూరు నివాసి ఒకరు ఫిర్యాదు చేసారు. సీఎం నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది మృతికి దారితీసిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
బెంగళూరులోని కొట్టిగేపల్య నివాసి అయిన గిరిష్ కుమార్ ఈ ఫిర్యాదు చేశారు. రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీల్ విజయోత్సవంలో పాల్గొనాలంటూ ముఖ్యమంత్రి ప్రజలను వ్యక్తిగతంగా ఆహ్వానించారని, తగినంత భద్రతా చర్యలు తీసుకోకుండానే ఆయన ప్రజలను ఆహ్వానించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఆర్సీబీ వంటి ప్రైవేట్ క్రికెట్ ఫ్రాంచైస్ కోసం గ్రాండ్ రెసెప్షన్కు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని గిరీష్ కుమార్ ప్రశ్నించారు. ఐపీఎల్ అనేది కమర్షియల్ వెంచర్ అని, ఇందులో నేషనల్ ప్రైడ్ కంటే లాభాల ఉద్దేశమే ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులను ఫ్రాంచైస్లు కొనుగోలు చేసి డబ్బులు కోసం ఆటలు నిర్వహిస్తుంటాయని, దేశం కోసమో, రాష్ట్రం కోసమో కాదన్నారు. ఇలాంటి సెలబ్రేషన్లను నేషనల్ హీరోలైన సైనికులకో, ఒలంపిక్ అథ్లెట్ల్ కోసమో చేసే సెలబ్రేషన్స్తో పోల్చకూడదన్నారు. ఆర్సీబీ టీమ్కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వాగతం పలకాల్సిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు. పౌరులను కాపాడే బాధ్యతలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యులను గుర్తించాలని ఆ ఫిర్యాదులో గిరీష్ కుమార్ కోరారు.
ఇవి కూడా చదవండి..
హిందీపై కమల్ హాసన్ హాట్ కామెంట్స్
బీజేపీకి యూట్యూబర్ మనీష్ కశ్యప్ గుడ్బై
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి