Share News

CM Stalin: ఢిల్లీ పెత్తనాన్ని ఎప్పటికీ అనుమతించం..

ABN , Publish Date - Jun 13 , 2025 | 10:51 AM

ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. సేలంలోని మోహన్‌కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

CM Stalin: ఢిల్లీ పెత్తనాన్ని ఎప్పటికీ అనుమతించం..

  • అమిత్‌షాకు మదురై ఎయిమ్స్‌ కనిపించలేదా..

  • మీ పథకాలకు నిధులిచ్చేది కూడా మేమే..

  • సేలం సభలో సీఎం స్టాలిన్‌ ధ్వజం

చెన్నై: ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. సేలంలోని మోహన్‌కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్లతో పూర్తయిన పథకాలకు ప్రారంభోత్సవం చేసిన ఆయన 1,01,203 మంది లబ్ధిదారులకు సహాయాలు పంపిణీ చేశారు.


ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల మదురైలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు విడుదలయ్యే నిధులను మళ్లించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేశారని, వాస్తవానికి కేంద్రం అమలు చేస్తున్న తాగునీటి పథకం, ప్రధాని ఆవాస్‌ యోజన పథకం తదితర పధకాలకు నిధులు చాలకపోతే తమ ప్రభుత్వమే 50 శాతం నిధులు సమకూర్చి ఆ పథకాలను పూర్తి చేస్తోందని, ఈ చేదు నిజం అమిత్‌షాకు తెలియకపోవటం గర్హనీయమన్నారు. మదురైలో రోజంతా పర్యటించిన అమిత్‌షాకు అక్కడ ఎయిమ్స్‌ ఆస్ప త్రి నిర్మాణ పనులు ఎలా నత్తనడకన జరుగుతున్నాయో తెలియకపోవటం శోచనీయమన్నారు.


nani3.jpg

పదేళ్లుగా ఎయిమ్స్‌ ఆస్పత్రి పనులు జరుగుతున్నాయంటే అక్కడ ఆస్పత్రి నిర్మిస్తున్నారా? లేక అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మిస్తున్నారో తనకు అర్థం కావటం లేదని స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. డీఎంకే గత నాలుగేళ్లలో మదురై నగరంలో అమలు చేసిన పథకాలను తెలుసుకుంటే కేంద్రంలోని పాలకులు ఆశ్చర్యపోతారన్నారు. కలైంజర్‌ శతజయంతి స్మారక గ్రంథాలయం, జల్లికట్టు స్టేడియం, కీళడి ఎగ్జిబిషన్‌ అంటూ పలు పథకాలను అమలు చేసినట్లు చెప్పారు. అమిత్‌షాలాగే కేంద్ర మంత్రి షెకావత్‌కూడా తమిళుల ప్రాచీన నాగరికత లోకానికి తెలియకుండా ఉండేందుకు కీళడి తవ్వకాల నివేదికలపై పసలేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.


తమిళుల ప్రాచీన నాగరికతను, సంస్కృతిని నాశనం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీళడి తవ్వకాల్లో లభించిన వస్తువులన్నీ తమిళుల నాగరికత ఐదువేల సంవత్సరాల నాటిదని రుజువు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, దానిపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) పల్లెత్తుమాట మాట్లాడకుండా మౌనం పాటించి కేంద్రానికి గులాంగిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్‌షా చెబుతుంటే ఈపీఎస్‌ నవ్వి ఊరుకుంటున్నారని తెలిపారు.


సేలం జిల్లాకు వరాల జల్లు...

ఈ సభలో సేలం జిల్లాకు స్టాలిన్‌ ఆరు వరాలను ప్రకటించారు. ఆ మేరకు సేలంలో రూ.100 కోట్లతో రహదారులను అభివృద్ధి పరుస్తామని, సేలం సెవ్వాపేట సంతను రూ.9కోట్లతో అభివృద్ధి పరచనున్నామని, శంకగిరి మున్పిపాలిటీలో కొత్త వాణిజ్య సముదాయం నిర్మిస్తామని, మేట్టూరు నరసింగాపురంలో కొత్త పురపాలక సంఘాల భవనాలు నిర్మిస్తామని, ఆత్తూరులో రూ.5 కోట్లతో సమగ్ర నీటి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇదేవిధంగా తారామంగళం, ఎడప్పాడి, ఆత్తూరు ప్రాంతాల్లో కొత్త నీటి పధకాలు అమలు చేస్తామని, తలైవాసల్‌ ఇళుప్పనత్తం వ్యవసాయ విక్రయ కేంద్రాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధిపరుస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈవీ వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, రాజేంద్రన్‌, ఎంపీలు సెల్వగణపతి, మలైయరసన్‌, మాతేశ్వరన్‌, మణి, శాసనసభ్యులు అరుల్‌, సదాశివం, సేలం కార్పొరేషన్‌ మేయర్‌ రామచంద్రన్‌, సేలం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బృందా దేవి తదితరులు పాల్గొన్నారు.


క్వింటాల్‌ దాన్యానికి రూ.2500లు...

గత నాలుగేళ్లుగా మేట్టూరు డ్యాం నుంచి జూన్‌ 12న తన చేతుల మీదుగా సాగునీరు విడుదల చేయడం రైతులకు ఎంత సంతోషం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఆనందం తనకు కలుగుతోందని స్టాలిన్‌ చెప్పారు. ఈ సంతోష సమయంలో క్వింటాల్‌ ధాన్యానికి రూ.2500లు కొనుగోలు ధర చెల్లిస్తామని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. సాధారణ రకం ధాన్యానికి రూ.131లు, సన్నరకం ధాన్యానికి రూ.156లు పెంచి చెల్లిస్తామన్నారు. ఆ మేరకు సాధారణ రకం వరిధాన్యానికి 2500లు, సన్నరకం వరిధాన్యానికి రూ.2545లు చొప్పున కొనుగోలు ధరలు చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. దీనివలన సుమారు 10లక్షల మంది అన్నదాతలు లబ్దిపొందుతారని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి.

9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 13 , 2025 | 11:13 AM