Bomb Threat to Indigo Flight: విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి మళ్లింపు
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:27 AM
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో హైదరాబాద్లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని ముంబైకు మళ్లించారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
హైదరాబాద్, డిసెంబర్ 02: కువైట్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులకు మంగళవారం తెల్లవారుజామున ఈ - మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన పైలెట్ను ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తం చేశారు. దాంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానాన్ని హుటాహుటిన ముంబైకి మళ్లించారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే విమానం నుంచి ప్రయాణికులను దింపేశారు. అనంతరం విమానంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అసలు అయితే ఈ ఇండిగో విమానం మంగళవారం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సి ఉంది.
ఇక ఈ బాంబు బెదిరింపు కారణంగా ఇండిగో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ బాంబు బెదిరింపుపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు, ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ విమానంలో ఎంత మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నారనే విషయాన్ని ఆ సంస్థ వెల్లడించ లేదు.
మరోవైపు సోమవారం ఉదయం 6.30 గంటలకు మహారాష్ట్ర థానే జిల్లాలోని ఒక పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు పాఠశాల సిబ్బంది ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని.. తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించక పోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల యథావిథిగా నడిచింది. దేశవ్యాప్తంగా నకిలీ బెదిరింపులు అధికమయ్యాయి. ఆ జాబితాలో పాఠశాలలు, ఎయిర్ పోర్టులు, ఆసుపత్రులు ఉన్నాయి. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైకి చేరువగా తీవ్ర వాయుగుండం
మెట్రోస్టేషన్లలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు..
For More National News And Telugu News