BJP Tiranga Yatra: ఆపరేషన్ సిందూర్ విజయంపై నేటి నుంచి తిరంగయాత్ర
ABN , Publish Date - May 13 , 2025 | 04:37 AM
పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ విజయంపై బీజేపీ తిరంగయాత్ర నిర్వహించనుంది. 13 నుంచి 23 మే వరకు 11 రోజుల పాటు ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది.

దేశ వ్యాప్తంగా 11 రోజుల పాటు నిర్వహించనున్న బీజేపీ
న్యూఢిల్లీ, మే 12: పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అణచివేయడానికి చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించడంతో బీజేపీ మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నిర్వహించనుంది. భారత సైన్యం సాధించిన విజయాలను, మోదీ ప్రభుత్వ నిబద్ధతను ప్రజలకు తెలియజేస్తూ 11 రోజుల పాటు ప్రచారం జరపనుంది. ఈ నెల 13 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా తెలిపారు. బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకొని ఊరేగింపులు నిర్వహిస్తారని చెప్పారు. ముగింపు రోజున విజయోత్సవ సభ నిర్వహిస్తారు. ఈ విషయమై సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జె.పి.నడ్డాలు విస్తృతంగా చర్చలు జరిపారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా జాతీయ కార్యదర్శులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ యాత్రను సీనియర్ నాయకులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, సంబిత్ పాత్రలు సమన్వయ పరచనున్నారు. మరోవైపు ఇది రాజకీయ ప్రచారం అన్న ఆరోపణలను ఓ సీనియర్ నాయకుడు ఖండించారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించడం లేదని, జాతి విజయాన్ని అందరికీ పంచుకోవడానికే దీన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.