BJP MP Ram Chander Jangra: పహల్గాం దాడి బాధిత వితంతువులపై బీజేపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం
ABN , Publish Date - May 25 , 2025 | 11:00 AM
పహల్గాం దాడి సందర్భంలో బాధిత మహిళలు అనుసరించాల్సిన తీరుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు ఎంపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రవాద దాడిలో వితంతువులుగా మారిన భార్యలనుద్దేశించి బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. "తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులు ఉగ్రవాదులపై తిరిగి పోరాడాల్సింది" అని సదరు ఎంపి చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
"వారు (మహిళా పర్యాటకులు) పోరాడాలి. వారు పోరాడాల్సిందని నేను నమ్ముతున్నాను. దీనివల్ల తక్కువ ప్రాణనష్టం జరిగేది. పర్యాటకులందరూ అగ్నివీర్ అయితే వారు ఉగ్రవాదులను ఎదుర్కొని చివరికి ప్రాణనష్టాన్ని తగ్గించేవారు. మన సోదరీమణుల్లో రాణి అహల్యాబాయి వంటి ధైర్య స్ఫూర్తిని మనం తిరిగి రగిలించాలి,” అని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. దేవి అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా భివానీని సందర్శించి, అక్కడ జరిగిన సభలో జాంగ్రా ఈ మాటలన్నారు.
ఉగ్రవాద బాధితుల పట్ల ఎంపీ రామ్ చందర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. రోహ్తక్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, రామ్ చందర్ జాంగ్రా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అవి తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ కూడా సదరు బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బిజెపి నాయకులు భారత సైన్యాన్ని, అమరవీరులైన సైనికులను పదే పదే అవమానిస్తున్నారని, ఇది వారి "కుటిల బుద్ధికి ప్రతిబింబమని ఆరోపించారు.
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా దీనిపై స్పందించారు. రామచంద్ర జంగ్రా వ్యాఖ్యలను అఖిలేష్ తీవ్రంగా ఖండించారు. వాటిని తీవ్రంగా అభ్యంతరకరంగా, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలుగా అఖిలేష్ పేర్కొన్నారు.“BJP ఒక రాజకీయ పార్టీ కాదు, మహిళా వ్యతిరేక మనస్తత్వం ఉన్న ఒక మురికి కూపం.” అని ఆయన విమర్శించారు.
అటు, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనేట్ కూడా దీనిపై స్పందించారు. “సిగ్గులేనితనానికి ఒక పరిమితి ఉంది” అని ఆమె బీజేపీ నేతల్ని దుయ్యబట్టారు.