Share News

UNESCO Gita Shastra: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:24 AM

భగవద్గీత, నాట్యశాస్త్రాలకు యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో స్థానం లభించింది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు

UNESCO Gita Shastra: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు

  • మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు గర్వించదగ్గ సమయం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి విశిష్ఠ గుర్తింపు లభించింది. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతకు, భరతముని రాసిన నాట్యశాస్త్రానికి యునెస్కో తన మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు కల్పించింది. ప్రఖ్యాత రిజిస్టర్‌లో వీటికి స్థానం లభించడంపై ప్రధాని మోదీ శుక్రవారం ‘ఎక్స్‌’లో స్పందించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతీయులైనా ఇది గర్వించదగ్గ క్షణం అన్నారు. కాలానికి అతీతమైన మన జ్ఞానానికి, గొప్పదైన సంస్కృతికి దక్కిన గుర్తింపు ఇది అని చెప్పారు. శతాబ్దాలుగా మన నాగరికత, చైతన్యాన్ని భగవద్గీత, నాట్యశాస్త్రం పెంచి పోషించాయని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


ప్రపంచ కేంద్రంగా దేశ సాంస్కృతిక జ్ఞానాన్ని ప్రతిష్ఠాపన చేయడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్విరామంగా కృషి జరుగుతోందని, దానికి లభించిన గుర్తింపే ఇది అని అమిత్‌ షా అన్నారు. వీటితో ఇప్పటివరకు మన దేశానికి చెందిన మొత్తం 14 ప్రతులకు స్థానం లభించినట్లయిందని షెకావత్‌ తెలిపారు. మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో మానవ జాతి వారసత్వానికి సంబంధించిన పుస్తకాలు, రాతప్రతులు, మ్యాప్స్‌, ఫొటోలు, ఆడియో, వీడియో రికార్డులకు చోటు కల్పిస్తారు. భగవద్గీత, నాట్యశాస్త్రంతోపాటు 74డాక్యుమెంటరీలకు కొత్తగా ఆ రిజిస్టర్‌లో స్థానం లభించింది.

Updated Date - Apr 19 , 2025 | 04:24 AM