Bengaluru Stampede: పోలీసులు మెజీషియన్లూ కాదు, దేవుళ్లూ కాదు.. ఆర్సీబీకి ట్రిబ్యునల్ అక్షింతలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:53 PM
మూడు నుంచి నాలుగు లక్షల మంది హాజరు కావడానికి, పోలీసులను నుంచి తగిన అనుమతి తీసుకోకపోవడానికి ఆర్సీబీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల పెద్దఎత్తున జనం వచ్చారని తెలిపింది.

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజయోత్సవాల సందర్భంగా జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) తప్పుపట్టింది. ఈ ఘటనకు ఆర్సీబీదే బాధ్యతని స్పష్టం చేసింది.
అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు
ఈ ఘటనలో పోలీసులను ట్రిబ్యునల్ సమర్థిస్తూ వాళ్లు కూడా మనుషులేనని, వాళ్లేమీ దేవుళ్లో.. మెజీషియన్లో కాదని పేర్కొంది. వేలితో రుద్దితే కోరినవన్నీ తీర్చే అల్లావుద్దీన్ అద్భుత దీపం వారి దగ్గర లేదని తెలిపింది. మూడు నుంచి నాలుగు లక్షల మంది హాజరు కావడానికి, పోలీసులను నుంచి తగిన అనుమతి తీసుకోకపోవడానికి ఆర్సీబీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పెద్దఎత్తున జనం వచ్చారని తెలిపింది.
ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ రద్దు
తొక్కిసలాట ఘటన అనంతరం సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ట్రిబ్యునల్ కొట్టివేసింది. జూన్ 5న ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వును ట్రిబ్యునల్లో వికాస్ కుమార్ సవాల్ చేశారు. అప్పటి బెంగళూరు పోలీస్ కమిషన్ బి.దయానంద, డీసీపీ శేఖర్ హెచ్ టేకణ్ణావార్ పేర్లు కూడా ఇందులో చేర్చారు. దీంతో వికాస్ సస్పెన్షన్ను న్యాయమూర్తులు బీకే శ్రీవాత్సవ, అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడు సంతోశ్ మెహ్రాతో కూడిన బెంగళూరు ధర్మాసనం కొట్టివేసింది. సర్వీసు నిబంధనల ప్రకారం అన్ని ప్రయోజనాలు అందుకునేందుకు పిటిషనర్ (వికాస్) అర్హుడని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. దయానంద, టే కణ్ణావార్ కేసుల విషయంలోనూ దీన్ని వర్తింపజేయవచ్చని తెలిపింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఆ ఇద్దరు అధికారులనూ తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు మెరుగుపడ్డాయి.
ఇవి కూడా చదవండి..
నో అన్నదే ఆన్సర్.. సీఎం మార్పుపై సూర్జేవాలా
ట్రంప్ మాటలు సరికాదు.. అప్పుడు మోదీతో నేనూ ఉన్నాను
For National News And Telugu News