Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఐడీకి అప్పగింత
ABN , Publish Date - Jun 07 , 2025 | 07:09 PM
చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేసారు.

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన ఘటనపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం శనివారంనాడు ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన సీఐడీ టీమ్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యాలయానికి వెళ్లి ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది.
కాగా, చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు శనివారంనాడు రాజీనామా చేసారు. బోర్డు ప్రెసిడెంట్ రఘరామ్ భట్కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు.
స్టేడియంలో ఈవెంట్ నిర్వహణకు ఆర్సీబీని తాము అనుమతించ లేదని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఈర్సీబీని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీనితో పాటు ఫ్రాంచైజ్ ఈవెంట్ పార్టనర్ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, స్టేడియం కంట్రోల్ బాధ్యతలపై కేఎస్సీఏ పేర్లు కూడా చేర్చారు. ఈ కేసులో అరెస్టు చేసిన నలుగురిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. వీరిలో ఆర్సీబీ మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసలే కూడా ఉన్నారు. తొక్కిసలాట ఘటన అనంతరం కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమైదింది. దీనిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ సారథ్యంలో ఏక సభ్య దర్యాప్తు కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు, ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుని స్థాయీ నివేదికను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 10న కేసు విచారణను చేపట్టనుంది.
ఇవి కూడా చదవండి..
పోలీసుల వాదన వినకుండా చర్యలా?.. తొక్కిసలాట ఘటనపై కిరణ్ బేడీ
పాక్తో గూఢచర్యం కేసులో కీలక మలుపు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి