Ram Darbar Pran Pratishtha: నేడే అయోధ్య రామదర్బార్ ప్రాణప్రతిష్ఠ.. ప్రత్యేకతలు ఇవే..!
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:33 PM
ప్రసిద్ధ అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ప్రత్యేకతలు ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉత్తర్ ప్రదేశ్: ప్రసిద్ధ అయోధ్య రామ మందిరంలో రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 6.30 గంటలకు మొదలైంది. మూడ్రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. గురువారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆ రోజు గంగా దసరా కావడం మరో విశేషం. రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంపై బంగారు శిఖరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గుడి ఇప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్దగా వీఐపీలను ఆహ్వానించలేదు. రాజకీయ నేతలూ ఈ కార్యక్రమానికి రావడం లేదు. సాధారణ భక్తులు, వేద పండితుల మధ్య సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మరింతగా తెలుసుకుందాం..
ప్రత్యేకతలు ఇవే..
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తొలుత సరయు నది నుంచి కలష్ యాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రలో భక్తులు, సాధువులతోపాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీలు పాల్గొంటారు.
రామాలయంలో 8 కొత్త గుళ్లను నిర్మించారు. సరయు నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఈ ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకం చేస్తారు. ఇవే విగ్రహాలకు మంగళవారం నాడు ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు.
జూన్ 5 నుంచి ఈ 8 ఆలయాలను ప్రజా సందర్శనకు అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. కానీ దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
ప్రధాన ఆలయంలోని మొదటి అంతస్తులో ఉన్న రామ్ దర్బార్కు తొలుత ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత నైరుతి దిశలో ఉన్న శేషావతార విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ప్రత్యేక పూజలు చేస్తారు.
జూన్ 5న మధ్యాహ్నం 1 గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. చివరి రోజు ప్రత్యేక పూజలతోపాటు భోగ్, హారతి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇవీ చదవండి:
సైనిక శిబిరంపై పడ్డ కొండచరియలు
ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి