అపహరణ.. అత్యాచారం.. అమ్మకం!
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:20 AM
ఆ బాలిక వయస్సు 17 ఏళ్లు. ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. రాజస్థాన్లోని మెయిన్పురి వాళ్ల స్వగ్రామం. గతేడాది మే 18న ఎప్పటిలాగే ఆమె ట్యూషన్ కోసం ఇంటి నుంచి బయల్దేరింది.

ఆగ్రా, ఫిబ్రవరి 15: ఆ బాలిక వయస్సు 17 ఏళ్లు. ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. రాజస్థాన్లోని మెయిన్పురి వాళ్ల స్వగ్రామం. గతేడాది మే 18న ఎప్పటిలాగే ఆమె ట్యూషన్ కోసం ఇంటి నుంచి బయల్దేరింది. మళ్లీ రాలేదు. వాళ్ల ఊరి పక్కన ఉండే ఓ వ్యక్తి ఆ బాలికను కిడ్నాప్ చేశాడు. ఇటావాకు తీసుకువెళ్లి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత, బాలికను ఆగ్రాలోని రవి, బాబీ అనే వాళ్లకు అమ్మేశాడు. వాళ్లిద్దరూ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను అజ్మేర్ తీసుకువెళ్లి.. అక్కడ ఆశా జైన్ అనే మహిళకు అమ్మేశారు.
ఆశా జైన్ సదరు బాలికను అజ్మేర్కే చెందిన విష్ణు మాలీ అనే వ్యక్తికి రూ.3.5లక్షలకు అమ్మేసింది. విష్ణు మాలీకి టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక. ఎక్కడా సంబంధం సెట్ కాలేదు. అందుకే, అతడు ఆశా జైన్ దగ్గర బాలికను కొనుక్కొని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అదే బాలికకు అదృష్టమైంది. టీనేజ్ అమ్మాయితో పెళ్లిపై ఎంతో మక్కువగా ఉన్న విష్ణు.. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో విరివిగా పోస్టు చేశాడు. ఆ పోస్టులు మెయిన్పురి వాళ్ల కంటపడ్డాయి. అప్పటికే, బాలిక అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెంటనే అజ్మేర్ వెళ్లి విష్ణు మాలీని, కిడ్నాపర్ నీరజ్ను అరెస్టు చేశారు.