Assam Floods: అసోంలో జలవిలయం.. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:49 PM
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్, 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

గౌహతి: అసోం (Assam)లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జలవిలయాన్ని తలపిస్తున్నాయి. కుషియార నదితో పాటు పలు నదులు పొంగుతుండటంతో 22 జిల్లాల్లోని వరద నీరు ప్రవహిస్తూ సుమారు 4 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. 54 రెవెన్యూ సర్కిల్స్లోని 758 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల బారిన పడి ఇంతవరకూ మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది.
కాఛార్ జిల్లా అతాలకుతలం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్, 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 1,09,790 మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు. శ్రీభూమి జిల్లాలో 83,621 మంది, నాగావ్లో 62,700 మందిపై ఈ ప్రభావం పడింది.
మూతపడిన స్కూళ్లు
కాఛార్ జిల్లాలో మంగళవారం వరకూ విద్యాసంస్థలన్నీ మూసే ఉంటాయని అధికారులు ప్రకటించారు. 3,524.38 హెక్టార్ల పంట నీట మునిగిందని, 696 పశువులు నీటిలో కొట్టుకుపోయాయని ఏఎస్డీఎంఏ బులిటెన్ తెలిపింది. 52 సహాయక శిబారాలను ఏర్పాటు చేయగా.. 10, 272 మంది అందులో తలదాచుకుంటున్నారు. 103 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు జిల్లాల నుంచి 'అర్బన్ ఫ్లడ్స్' వార్తలు అందగా..41,000 మంది వరదల్లో చిక్కుకున్నారు. మరో నాలుగు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ప్రభావం ఎక్కువగా ఉంది.
కాగా, పలు జిల్లాల్లో బాధిత కుటుంబాలను రిలీఫ్ క్యాంప్లకు అధికార యంత్రాగం తరలిస్తోంది. 300కు పైగా రెవెన్యూ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టు శ్రీభూమి జిల్లా కమిషనర్ ప్రదీప్ కుమార్ ద్వివేది తెలిపారు. 40,000 మందికి పైగా ప్రజలపై ఈ ప్రభావం పడిందని, సహాయ సామగ్రి, ఆహార పంపిణీ జరుగుతోందని చెప్పారు. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామన్నారు.
వరద పరిస్థితిపై అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఒక ప్రకటన చేస్తూ 20 జిల్లాలోని 3.64 లక్షల మందిపై వరద ప్రభావం పడిందని చెప్పారు. కాగా, పలు నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రజలు, ముఖ్యంగా నదీ ప్రాంతాల ఒడ్డున నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒక ప్రకటనలో కోరారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ వాయు రవాణా పరిశ్రమలో భారత విమానయాన రంగం కీలకపాత్ర
ఆపరేషన్ సిందూర్పై వ్యాసరచన పోటీలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి