EC: బిహార్లో లక్ష మంది ఓటర్లు మిస్సింగ్.. రెండ్రోజులే గడువు
ABN , Publish Date - Jul 23 , 2025 | 08:29 PM
ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఓటర్లు కానీ, రాజకీయ పార్టీలు కానీ తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని సంబంధిత ఈఆరోఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను కానీ, ఏఈఆర్ఓ (అస్టిస్టెంట్ ఈఆర్ఓ)వద్ద కానీ తమ అభ్యంతరాన్ని దాఖలు చేయవద్దని ఈసీ తెలిపింది.

పట్నా: బిహార్లో ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో సుమారు లక్ష మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్కు మరో రెండ్రోజులే ఉండగా, దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఇంకా తమ ఎన్యూమరేషన్ దరఖాస్తులను సమర్పించలేదని ఎన్నికల కమిషన్ బుధవారం నాడు తెలిపింది.
ఎస్ఐఆర్ తొలి దశ దాదాపు పూర్తికావచ్చిందని, ఇంతవరకూ 7.17 కోట్ల ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఈసీ తెలిపింది. 20 లక్షల మంది మృతిచెందగా, 28 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిపోయారని, 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఎన్రోల్ చేసుకున్నారని, లక్ష మంది అన్ట్రేసబుల్ ఉన్నారని, 15 లక్షల ఫారాలు రిటర్న్ కాలేదని తెలిపింది. ఎస్ఐఆర్ మొదటి ఫేజ్ పూర్తికాగానే ఆగస్టు 1న ముసాయిదా ఎన్నికల జాబితాను విడుదల చేస్తామని తెలిపింది.
ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఓటర్లు కానీ, రాజకీయ పార్టీలు కానీ తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని సంబంధిత ఈఆరోఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను కానీ, ఏఈఆర్ఓ (అస్టిస్టెంట్ ఈఆర్ఓ) వద్ద కానీ అభ్యంతరాన్ని దాఖలు చేయవచ్చని ఈసీ తెలిపింది. అర్హులైన వారు ఎన్నికల జాబితాలో పేర్లు లేకుంటే తమ క్లెయిమ్స్ను సెప్టెంబర్ 1లోగా సమర్పించాలని కోరింది. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారి పేర్లు ముసాయిదా ఎన్నికల జాబితాలో ఉంటాయని తెలిపింది. ఎన్యూమరేషన్ ఫారాల్లో ఎవరైతే మొబైల్ నెంబర్లు ఇచ్చారో వారికి మెసేజ్లు పంపుతామని వివరించింది.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి
అల్ఖైదా కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి