Viral Video: గుడిపై బాంబు దాడి .. సీసీటీవీలో భయానక దృశ్యాలు..
ABN , Publish Date - Mar 15 , 2025 | 02:18 PM
అమృత్సర్లో ఓ గుడిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బాంబు దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో రికార్డైన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

అమృత్సర్లో అసాంఘీక శక్తులు పెచ్చు మీరి విలయ తాండవం చేస్తున్నాయి. అమృత్సర్తో పాటు గురుదాస్పూర్లలో వారానికో బాంబు దాడి ఘటన చోటు చేసుకుంటోంది. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఏ క్షణం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అల్లాడిపోతున్నారు. తాజాగా, అమృత్సర్లోని ఓ గుడిపై దుండుగులు బాంబు దాడి చేశారు. బైకుపై వచ్చిన ఆ దుండగులు గుడిపై బాంబు వేసి పరారయ్యారు. ఈ బాంబు దాడిలో గుడి గోడలు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. జనాలకు ఏమీ కాలేదు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. గుడి పూజారి శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫొటేజీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని అమృత్సర్ పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ బుల్లార్ అన్నారు.
సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు..
గుడిపై దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజీల ప్రకారం.. రాత్రి కావటంతో ఆ ప్రదేశం మొత్తం నిర్మానుషంగా ఉంది. బైకుపై ఓ ఇద్దరు వ్యక్తులు గుడి దగ్గరకు వచ్చారు. బైకు ఆగిన తర్వాత వెనకాల కూర్చున్న వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న బాంబును గుడిపై విసిరాడు. ఆ వెంటనే బైకు మీద వచ్చి కూర్చున్నాడు. అతడు వచ్చి కూర్చున్న వెంటనే బైకు అక్కడినుంచి వెళ్లిపోయింది. బాంబు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. నిప్పు కణికలు ఎగసిపడ్డాయి. దాడికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత నాలుుగు నెలల నుంచి అమృత్సర్తో పాటు గురుదాస్పూర్లో బాంబు దాడి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లపై బాంబు దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి.
పాఠశాలపై బాంబు దాడి..
బస్సు డ్రైవర్ను ఉద్యోగంలోంచి తీసేశారనే కోపంతో పాఠశాలపై బాంబు దాడి చేశారు గుర్తు తెలియని కొందరు దుండగులు. ఈ సంఘటన బీహార్లోని హాజీపూర్లో జరిగింది. స్కూలు యాజమాన్యం చెప్పిన వివరాల మేరకు.. బీహార్ హాజీపూర్కు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడ్ని ఉద్యోగం లోంచి తీసేశారు. దీంతో అతడు స్కూలు యాజమాన్యంపై కక్ష గట్టాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన గ్యాంగుతో స్కూలుపై బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..