Share News

Amit Shah: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా నిలుస్తాం

ABN , Publish Date - May 30 , 2025 | 02:53 PM

పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని అమిత్‌షా ప్రశంసించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు.

Amit Shah: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా నిలుస్తాం

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack)ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు తాము పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో బాధిత కుటుంబాలను హోం మంత్రి కలుసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ షెల్లింగ్‌ దాడుల్లో దెబ్బతిన్న, మృతిచెందిన బాధిత కుటుంబాలకు నియామక పత్రాలను ఆయన అందజేశారు.


ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ, జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు జరపడం గర్హనీయమని అన్నారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామకాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. తమ ప్రియతములను పోగొట్టుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగమో, పరిహారమో భర్తీ చేయలేదని, అయితే వారి కుటుంబాలకు ప్రభుత్వం, ప్రజల సంఘీభావంగా ఉంటుందని, యావద్దేశం అండగా నిలుస్తుందని చెప్పారు. పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు.


పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, ప్రజలు బలంగా కోరుకోవడం, ప్రధానమంత్రి నిర్ణయాత్మక నాయకత్వం, విలువైన ఇంటెలిజెన్స్ సమాచారం, భారత సాయుధ బలగాల అసమాన ప్రతిభ వల్లే అత్యంత భీకర దాడులు జరపగలిగామని అమిత్‌షా అన్నారు. వందలాది మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని, తమపై దాడులు జరిపినట్టు పాక్ చెప్పుకుంటున్నప్పటికీ మన మిలటరీ కేవలం టెర్రరిస్టు శిబిరాలనే టార్గెట్ చేసిందని వివరించారు. ఒక్క ఇండియన్ ఆర్మీ పోస్ట్ కూడా దెబ్బతినలేదని, పాకిస్థాన్ పౌరులెవరికీ నష్టం జరగలేదని చెప్పారు. టెర్రరిస్టు శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశామన్నారు. ఇందుకు బదులుగా పాకిస్థాన్ జనావాసాలపై గుళ్లవర్షం కురిపించడంతో ముఖ్యంగా పూంచ్‌లో బాగా నష్టం జరిగిందని చెప్పారు. గురుద్వారాలు, మద్రసాలను కూడా పాక్ విడిచిపెట్టలేదని, ఈ చర్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుపట్టిందని చెప్పారు. ఇందుకు ప్రతిగా భారత ఆర్మీ తొమ్మిది పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేయడంతో పాక్ చర్చలంటూ దిగొచ్చిందని వివరించారు.


పూంచ్ బాధితుల పరామర్శ

అమిత్‌షా జమ్మూకశ్మీర్‌లో ఏప్రిల్ 6వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇది మూడోసారి. పూంచ్‌లో పాక్ కాల్పుల్లో దెబ్బతిన్న కుటుంబాలను శుక్రవారంనాడు ఆయన పరామర్శించారు. మే 7 నుంచి 10వ తేదీ వరకూ పాక్ జరిపిన కాల్పుల్లో 28 మంది పౌరులు మరణించగా, వీరిలో 14 మరణాలు పూంచ్‌లోనే చోటుచేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

సంతకాలు చేస్తారు.. డెలివరీలు జరగవు.. వాయుసేన చీఫ్ సీరియస్!

పీవోకే తిరిగొస్తుంది: రాజ్‌నాథ్‌

For National News And Telugu News

Updated Date - May 30 , 2025 | 03:10 PM