Amit Shah: ఆపరేషన్ సిందూర్ను కూడా వదల్లేదు.. మమతా బెనర్జీపై అమిత్షా ఫైర్
ABN , Publish Date - Jun 01 , 2025 | 06:13 PM
కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్షా ఆదివారం నాడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు.

కోల్కతా: ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఆపరేషన్ సిందూర్ (Operation sindoor), వక్ఫ్ సవరణ చట్టాన్ని (Waqf Amendent Act) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యతిరేకిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah) అన్నారు. ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులను అగౌరవపరుస్తున్నారని తప్పుపట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మహిళలంతా ముఖ్యమంత్రికి, టీఎంసీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ఆపరేషన్ సిందూర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని మమతాబెనర్జీ ఇటీవల ఆరోపించారు.
జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలు
కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్షా ఆదివారం నాడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారని, వారిని అడ్డుకోవడం ఆమె వల్ల కాదని, ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆపని చేయగలదని చెప్పారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఆపరేషన్, కంచె కోసం భూములు కేటాయించమని అడిగినా ఆమె కేటాయించలేదని మండిపడ్డారు. అందువల్లే చొరబాట్లు కొనసాగుతున్నాయని ఆరోపించారు. 'అధికారం కోసం, ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఇవన్నీ చేస్తున్నారు. మీ తర్వాత మీ మేనల్లుడు సీఎం కావచ్చు. కానీ ఇదెంతమాత్రం కొనసాగనీయరాదు' అని అమిత్షా అన్నారు.
2026లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
బెంగాల్లో ఏళ్ల తరబడి కమ్యూనిస్ట్ పాలన నడిచిందని, ఆ తర్వాత 'మా, మాటీ, మానుష్' నినాదంతో మమతాబెనర్జీ అధికారంలోకి వచ్చారన్నారు. అయితే ఆమె నాయకత్వంలో బంగ్లా చొరబాట్లు, మహిళలపై నేరాలు, నేరపూరిత ఘటనలు, బాంబు పేలుళ్ల ఘటనలు పెరిగాయని అమిత్షా ఆరోపించారు. మమతా బెనర్జీ పగ్గాలు చేపట్టాక వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, దీదీని సాగనంపే సమయం వచ్చిందని అన్నారు. పశ్చిమ బెంగాల్ 2026 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
దేవుడు కంటే మీరే ఎక్కువ.. లూలూ, రబ్రీకి తేజ్ ప్రతాప్ ఎమోషనల్ పోస్ట్
అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్.. పోటీ ఎక్కడినుంచంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి