Air India Plane: గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
ABN , Publish Date - Jun 13 , 2025 | 11:33 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఎయిరిండియా విమానం దడ పుట్టించింది. గాల్లోనే 3 గంటల పాటు ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..

అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం అందర్నీ కలచివేసింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం అనూహ్యంగా కుప్పకూలడం, అందులోని 242 మంది ప్రాణాలు కోల్పోవడంపై అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణీ కూడా ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం గురించి అంతా మాట్లాడుకుంటున్న సమయంలోనే మరో ఎయిరిండియా విమానం గుబులు పుట్టించింది. అది కూడా లండన్కు వెళ్తున్న ఫ్లైటే కావడం గమనార్హం. లండన్కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం 3 గంటల పాటు గాల్లోనే ఉండి తిరిగి వెనక్కి వెళ్లింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది.. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
లండన్కు వెళ్తూ..
ముంబై నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఏఐసీ129 విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది. శుక్రవారం ఉదయం 5.39 గంటలకు ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. అయితే 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి ముంబైకి చేరుకుంది. లండన్కు వెళ్లాల్సిన విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టత లేదు. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ విమానాన్ని వెనక్కి మళ్లించారని సమాచారం. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పశ్చిమాసియాలో పలు చోట్ల గగనతలాల మీద ఆంక్షలు విధించారు. ఇదే కారణంతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాలను దారి మళ్లిస్తున్నారు. అలాగే పలు విమాన సర్వీసులను రద్దు కూడా చేసేశారు. ఈ క్రమంలోనే ఎయిరిండియా విమానాన్ని వెనక్కి మళ్లించారని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి