PM Modi visit: ఎలా బతికానో నాకే అర్థం కావట్లేదు!
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:46 AM
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైన ప్రయాణికుడు విశ్వా్సకుమార్ రమేశ్ (45)! తాను బతకడం నిజంగా అద్భుతమేనని రమేశ్ చెప్పారు.

విమానం కూలగానే నేనూ చనిపోయాననుకున్నా
విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ రమేశ్ వ్యాఖ్యలు
రమేశ్ను పరామర్శించిన ప్రధాని మోదీ
అహ్మదాబాద్, జూన్ 13: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైన ప్రయాణికుడు విశ్వా్సకుమార్ రమేశ్ (45)! తాను బతకడం నిజంగా అద్భుతమేనని రమేశ్ చెప్పారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం డీడీ న్యూస్తో ప్రమాద ఘటన గురించి వివరించారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. విమానంలో ఎడమవైపు ఉన్న తన 11ఏ సీటు అత్యవసర ద్వారానికి సమీపంలో ఉందన్నారు. ‘‘అంతా నాకళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కావడం లేదు. విమానం కింద పడగానే నేనూ చనిపోయాననుకున్నా. కళ్లు తెరిచి చూసేసరికి శిథిలాల్లో ఉన్నా. విమానం కూలిన తర్వాత నేను కూర్చున్న భాగం భవనం గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయింది. విమానం డోర్ విరిగిపోయి ఉంది. నా సీటు విరిగిపోయి, ఎగిరి పడ్డా. వెంటనే లేచి, శిథిలాల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చా. విమానం కుడివైపు భాగంలో ఉన్నవారికి పక్కనే గోడ ఉండడంతో బయటపడే మార్గం లేకపోయింది. ఎడమ వైపు మాత్రం కొంత ఖాళీ ప్రదేశం ఉండడంతో నేను బయటపడగలిగా. నేను బతికానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.
నా కళ్ల ముందే ప్రయాణికులు ప్రాణాలొదిలారు. శిథిలాల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంటల ధాటికి నా ఎడమ చేతికి గాయమైంది’’ అని రమేశ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ను శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆయనకు ప్రాణాపాయంలేదని వైద్యులు తెలిపారు. కాగా బ్రిటన్లో నివాసముంటున్న రమేశ్ గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రాణాలతో బయటపడడాన్ని ఊహకందని అద్భుతంగానే భావిస్తున్నారు. ఎయిరిండియా విమానంలోని 11ఏ సీటులో రమేశ్ కూర్చున్నారు. ఈ సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గర్లో ఉండడం కూడా రమేశ్ ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సీట్ మ్యాప్ ప్రకారం.. బోయింగ్ 787-8 విమానాల్లో ఎకానమీ క్లాస్లో మొదటి వరుసలో ఉన్న ఆరు సీట్లలో 11ఏ ఒకటి. అత్యవసరంగా బయటకి వెళ్లే మార్గాల్లో ఒకదానికి దగ్గర్లో ఉన్న కిటికీ సీటు ఇది. కాగా, ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 27బోయింగ్787-8 డ్రీమ్లైనర్ విమానాలున్నాయి. రానున్న రోజుల్లో ఈ విమానాలన్నింటినీ భద్రతా పరీక్షలకు పంపే అవకాశాలు ఉన్నాయి.