Fake Cancer Drug Racket: హై ప్రొఫైల్ కేసు: మూడేళ్లకు నిందితుడు ఆలం అరెస్ట్
ABN , Publish Date - May 24 , 2025 | 08:21 PM
3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నకిలీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హై ప్రొఫైల్ కేసులో పోలీసులు నిందితుడి కోసం మూడేళ్లుగా వెతుకుతున్నారు. ఎట్టకేలకు హనీమూన్ మూడ్లో ఉన్న ఆలంను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అప్పట్లో సంచలనం సృష్టించిన నకిలీ క్యాన్సర్ డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసులో ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మూడు సంవత్సరాలకు పైగా అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న పశ్చిమ బెంగాల్కు చెందిన ఆలం అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సబీర్ ఆలం పశ్చిమ బెంగాల్లోని రాణి గంజ్లో తన హనీమూన్లో ఉన్నట్లు సమాచారం అందిన తర్వాత అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.
ఇటీవల, ఢిల్లీ పోలీసులకు ఆలం.. రాణి గంజ్లో తన హనీమూన్ను ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో పోలీస్ బృందం రాణి గంజ్ చేరుకుని హోటళ్ళు, అతిథి గృహాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఇంతలో, మే 20న, ఆలం రాణి గంజ్ నుండి పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లోని కందాకు బస్సులో వెళ్తున్నాడని వారికి తెలిసింది. దీనిపై తక్షణమే రియాక్ట్ అయిన ఆ బృందం కందా బస్టాండ్కు చేరుకుని నిందితుడిని పట్టుకుంది. అతని సహచరుల అరెస్టు తర్వాత, ఆలం అజ్ఞాతంలోకి వెళ్లి ఇటీవల వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆలం చదువు మధ్యలో మానేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేశాడు.
కాగా, ఈ కేసు మొదట నవంబర్ 2022లో వెలుగులోకి వచ్చింది. నకిలీ క్యాన్సర్ డ్రగ్స్ కలిగి ఉన్నందుకు గాను నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో ఒక పెద్ద అక్రమ ఔషధ రాకెట్ బయటపడింది. ఈ క్రమంలో ఇద్దరు వైద్యులు సహా 14 మందిని పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. హర్యానాలోని సోనిపట్లోని ఒక తయారీ యూనిట్, ఉత్తరప్రదేశ్లోని ట్రోనికా సిటీలోని ఒక గిడ్డంగిపై కూడా దాడులు చేసి పెద్ద మొత్తంలో నకిలీ క్యాన్సర్ మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఆలం ఈ సిండికేట్లో కీలక పాత్ర పోషించాడు. కోల్కతాలో నకిలీ క్యాన్సర్ మందుల పంపిణీని కోఆర్డినేట్ చేశాడు. బంగ్లాదేశ్కు షిప్మెంట్స్ విషయంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ మందులు అక్కడున్న డాక్టర్ రాసెల్కు సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ పబిత్ర నారాయణ్ ప్రధాన్, శుభం మన్నా వంటి సహ నిందితులు ఈ కేసులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ ఇద్దరి మృతదేహాలు అప్పగించండి.. హైకోర్టులో పిటిషన్
NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్లో ప్రశంసల వర్షం
Read latest AP News And Telugu News